Today History: 2010 ఫిబ్రవరి 24.. గ్వాలియర్లోని కెప్టెన్ రూప్సింగ్ స్టేడియం.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ ధోనీ.. సరిగ్గా 50 ఓవర్ మూడో బంతిని ఆడిన సచిన్ టెండూల్కర్ ఒక్క పరుగు తీసాడు. అంతే స్టేడియంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. తమ క్రికెట్ దేముడు వన్డేల్లో అప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని డబుల్ సెంచరీని సాధించడంతో ప్రపంచం మొత్తం పండగ చేసుకున్నది. వన్డే క్రికెట్ ఆడటం మొదలెట్టిన 39 సంవత్సరాలకు సరిగ్గా ఇదే రోజున డబుల్ సెంచరీ రికార్డును సచిన్ తన పేరిట లిఖించుకున్నాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్లో 147 బంతుల్లో 25 ఫోర్లు, 3 సిక్సర్లతో సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ ఫీట్ను సాధించాడు. టెండూల్కర్ డబుల్ సెంచరీతో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 3 వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ధోని నేతృత్వంలోని భారత జట్టు 153 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. వన్డేలు, టెస్టులు, టీ20లు ఇలా అన్ని ఫార్మాట్లలో ఎవరికీ అందని రికార్డులను తన పేరిట రాసుకున్న టెండూల్కర్.. 2013లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఇప్పటి వరకు టెస్టులు, వన్డేలు.. రెండింటిలోనూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అంతర్జాతీయంగా అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2019లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ప్రవేశించిన ఆరవ భారతీయుడిగా నిలిచాడు.
సచిన్ రికార్డును ఏడాది 9 నెలల 14 రోజులపాటు పదిలంగా ఉన్నది. 2011 డిసెంబర్ 8 న ఇండోర్లో జరిగిన వన్డేలో వీరేంద్ర సెహ్వాగ్ 209 పరుగులు చేసి సచిన్ రికార్డును బద్దలు కొట్టారు. కెప్టెన్గా ఉండి మరీ డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా సెహ్వాగ్ చరిత్రలో నిలిచారు. కాగా, వన్డే క్రికెట్లో 200 పరుగులు ఎనిమిది సార్లు నమోదయ్యాయి. భారత్కు చెందిన రోహిత్ శర్మ మూడు సార్లు డబుల్ సెంచరీలో చేసి చరిత్ర తిరగ రాశారు. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడి రికార్డు కూడా రోహిత్దే. 2014 లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో శ్రీలంకపై 173 బంతుల్లో 264 పరుగులు చేశాడు. 2015 లో మార్టిన్ గఫ్టిల్ వెస్టిండీస్పై 237 పరుగులతో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసుకున్నాడు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..