ODI World Cup | పరుగులు ఏరులై పారిన.. వన్డే ప్రపంచకప్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ నయా రికార్డు సృష్టించాడు. వరల్డ్కప్లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా కొండంత స్కోరుతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పగా.. మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగవంతమైన సెంచరీ తన పేరిట లిఖించుకున్నాడు. లంకేయులను చీల్చి చెండాడుతూ.. ఫోర్లు సిక్సర్లతో చెలరేగిపోయిన మార్క్రమ్.. ఈ మ్యాచ్లో 49 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. వన్డే విశ్వసమరంలో ఇదే అత్యంత వేగవంతం కావడం విశేషం. గతంలో ఈ రికార్డు ఐర్లాండ్ ప్లేయర్ కెవిన్ ఓబ్రైన్ (50 బంతుల్లో) పేరిట ఉంది. భారత్లోనే జరిగిన 2011 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో మ్యాచ్ లో ఓబ్రైన్ ఈ ఫీట్ నమోదు చేయగా.. తాజాగా ఢిల్లీ వేదికగా లంకేయులపై మార్క్రమ్ నయా చరిత్ర లిఖించాడు.
అప్పటికే క్వింటన్ డికాక్, డసెన్ సెంచరీలతో దక్షిణాఫ్రికా జట్టుకు మంచి ఆరంభం అందించగా.. మెరుగైన పునాదిపై డికాక్ అందమైన పరుగుల సౌదాన్ని నిర్మించాడు. బౌలర్తో సంబంధం లేకుండా.. తన విధ్వంసకాండ కొనసాగించాడు. బంతి ఎక్కడ పడ్డా దానిపై ఆకలిగొన్న బెబ్బులిలా విరుచుకుపడిన మార్క్రమ్.. నయా రికార్డు లిఖించాడు. ఈ మ్యాచ్ ద్వారా దక్షిణాఫ్రికా మిడిలార్డర్ పవర్ ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసి వచ్చింది. లంక బౌలర్లను ఊచకోత కోస్తూ.. దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. వరల్డ్కప్లో 400 పరుగుల మార్క్ నమోదు చేయడం దక్షిణాఫ్రికాకు ఇది మూడోసారి కావడం విశేషం. సఫారీ జట్టు గతంలో 2015 ప్రపంచకప్లో ఐర్లాండ్పై 411 పరుగులు, వెస్టిండీస్పై 408 పరుగులు చేసింది. అలాగే ఓవరాల్గా వన్డే క్రికెట్ చరిత్రలో ఎక్కుసార్లు 400 పైచిలుకు పరుగులు చేసిన జట్టుగానూ దక్షిణాఫ్రికా చరిత్రకెక్కింది. ఇప్పటి వరకు సఫారీ టీమ్ అత్యధికంగా 8 సార్లు నాలుగువందల మార్క్ దాటగా.. భారత్ ఆరుసార్లతో రెండోస్థానంలో ఉంది. ఓవరాల్గా వన్డేల్లో సఫారీ జట్టుకు ఇది నాలుగో అత్యధిక స్కోరు.