Ruturaj Gaikwad | టీమిండియా సెలెక్టర్లను మాజీ క్రికెటర్ వెంగ్ సర్కార్ సూటిగా ప్రశ్నించాడు. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ భవితవ్యంపై ప్రశ్నలు సంధించాడు. రుతురాజ్ ఈ ఏడాది అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్లో టాప్ స్కోరర్గా నిలిచిన అతను.. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కూడా సత్తా చాటుతున్నాడు. ఈ టోర్నీలో వరుసగా మూడు సెంచరీలు సాధించాడు.
మధ్యప్రదేశ్పై 136, ఛత్తీస్గఢ్పై 154 నాటౌట్, కేరళపై 124 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతన్ని సౌతాఫ్రికాలో జరిగే వన్డే మ్యాచులకు ఎంపిక చేయాలని వెంగ్సర్కార్ సూచించాడు. ఇంకా ఎన్ని పరుగులు చేస్తే రుతురాజ్కు అవకాశమిస్తారు? అని ప్రశ్నించాడు. ‘ఫామ్లో ఉన్న ఆటగాడిని కచ్చితంగా ఎంపిక చేయాలి.
ఇంకా ఎన్ని పరుగులు చేసి అతను తన సత్తా నిరూపించుకోవాలి? అతన్ని ఎంపిక చేసి అవకాశం ఇవ్వాల్సిన తరుణమిదే’ అని మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా అదిరిపోయే ఫామ్లో ఉండటంతో రుతురాజ్కు స్థానం దక్కడం కష్టంగా కనిపిస్తోంది.
దీనిపై కూడా వెంగ్ సర్కార్ మాట్లాడాడు. కావాలంటే రుతురాజ్ 3వ స్థానంలో కూడా ఆడగలడన్నాడు. ‘రుతురాజ్ వయసు 18 లేదా 19 ఏళ్లు కాదు. 24 సంవత్సరాలు. అతనికి 28 ఏళ్లు వచ్చిన తర్వాత ఎంపిక చేసి ప్రయోజనం ఏముంది?’ అని ఆయన ఘాటుగా ప్రశ్నించాడు.