MS Dhoni | చెన్నై: చెన్నై సూపర్కింగ్స్ దిగ్గజ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ మాయ చేశాడు. తన కెరీర్ ఆసాంతం ఎవరికీ అంతుపట్టని నిర్ణయాలు తీసుకున్న ధోనీ మరోమారు అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ అనూహ్యంగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఆది (2008) నుంచీ సారథిగా ఉన్న మహేంద్రుడు.. 2024 ఎడిషన్కు ఒక్కరోజు ముందు ఆ బాధ్యతలను యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. 42 ఏండ్ల ధోనీకి ఈ సీజనే చివరిదని (?) ఊహాగానాలు వినిపిస్తున్న వేళ.. అతడు కెప్టెన్సీ పగ్గాలను గైక్వాడ్కు అందించాడు. ఐపీఎల్ -17 ఆరంభానికి ముందు నిర్వహించిన కెప్టెన్స్ మీట్లో ధోనీకి బదులుగా గైక్వాడ్ ప్రత్యక్షమవడంతో ఆశ్చర్యపోవడం అభిమానుల వంతైంది.
సారథ్య మార్పుతో పాటు రిటైర్మెంట్ విషయంలో ధోనీ నిర్ణయాలు ఎవరికీ ఓ పట్టాన అర్థం కావు. 2014లో మహేంద్రుడు.. కోహ్లీకి టెస్టు సారథ్య పగ్గాలు అప్పజెప్పి అందర్నీ విస్మయానికి గురిచేశాడు. 2019 వన్డే వరల్డ్ కప్లో న్యూజిలాండ్తో సెమీస్లో ఓడాక మళ్లీ ఏడాది వరకూ అంతర్జాతీయ మ్యాచ్ ఆడని ధోనీ.. 2020 ఆగస్టు 15న రిటైర్మెంట్ ప్రకటించాడు. 2022 ఐపీఎల్ సీజన్కు రెండ్రోజుల ముందు కెప్టెన్గా తప్పుకుని రవీంద్ర జడేజాకు ఆ బాధ్యతలు కట్టబెట్టాడు. కానీ ఆ సీజన్లో జడేజా 8 మ్యాచ్లకు మాత్రమే సారథిగా ఉండి ఒత్తిడి తట్టుకోకపోవడంతో తిరిగి ధోనీనే కెప్టెన్గా వ్యవహరించాడు.
2008 నుంచి చెన్నైకి సారథిగా ఉంటూ తమిళనాట కుటుంబసభ్యుడిగా మారిన ‘తలా’.. ఐపీఎల్తో పాటు చాంపియన్స్ లీగ్లో కలిపి సీఎస్కేకు 235 (చెన్నై ఆడిన 249 మ్యాచ్లలో) మ్యాచ్లలో నాయకుడిగా ఉన్నాడు. 2016, 2017 సీజన్లలో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ను నడిపించాడు. ధోనీ సారథ్యంలో చెన్నై ఐపీఎల్లో ఏకంగా పదిసార్లు ఫైనల్ చేరగా ఐదు సార్లు (2010, 2011, 2018, 2021, 2023) విజేతగా నిలిచింది.