చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఉత్కంఠ విజయం సాధించింది. ప్రధాన బ్యాటర్లు బట్లర్ (2), సంజూ శాంసన్ (15), దేవదత్ పడిక్కల్ (3), హెట్మెయర్ (6) విఫలమైనా కూడా.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (59) జట్టును ఆదుకున్నాడు. అయితే అప్పటికీ రాజస్థాన్ విజయంపై పూర్తిగా నమ్మకం లేకపోయింది. అలాంటి సమయంలో రవిచంద్రన్ అశ్విన్ (40 నాటౌట్) ధాటిగా ఆడి జట్టును విజయానికి చేరువ చేశాడు.
చివరి ఓవర్లో 7 పరుగులు కావలసి ఉండగా.. బౌండరీ బాదిన అశ్విన్.. తర్వాతి బంతికి సింగిల్ తీశాడు. ఆ తర్వాత పతిరాణా వైడ్ వేయడంతో రాజస్థాన్ శిబిరం సంబరాల్లో మునిగిపోయింది. మరో రెండు బంతులు ఉండగానే.. ఐదు వికెట్ల తేడాతో రాజస్థాన్ విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్థాన్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. చెన్నై బౌలర్లలో సోలంకి రెండు వికెట్లు తీయగా.. మిచెల్ శాంట్నర్, సిమర్జీత్ సింగ్ చెరో వికెట్ తీసుకున్నారు.