టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ ఇప్పటివరకు ఛేదించిన అత్యధిక లక్ష్యం 359. 2019 యాషెస్ సిరీస్లో ఆసీస్పై ఇంగ్లండ్ ఈ ఫీట్ నమోదు చేసింది.
‘ప్రత్యర్థి మారినా మా ఆటతీరులో ఎలాంటి మార్పు ఉండదు’ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అన్న మాటలివి. ప్రపంచ టెస్టు చాంపియన్ న్యూజిలాండ్పై టెస్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లిష్ జట్టు.. అదే జోష్లో భారత్తో టెస్టు సిరీస్ను సమం చేస్తామని ముందే హెచ్చరించింది. అందుకు తగ్గట్లే మైదానంలో విశ్వరూపం కనబర్చిన ఆతిథ్య జట్టు.. ట్రోఫీని పంచుకునే దిశగా సాగుతున్నది!
టార్గెట్ ఎంతైనా ఛేదించాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగుతామని బల్లగుద్దిచెప్పిన బెయిర్స్టో.. మైదానంలో దాన్ని ఆచరించి చూపితే.. మాజీ కెప్టెన్ జో రూట్ తనను ప్రపంచ అత్యుత్తమ టెస్టు బ్యాటర్ ఎందుకు అంటారో మరోసారి నిరూపించాడు. ఫలితంగా టెస్టు క్రికెట్ చరిత్రలో అతి పెద్ద లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇంగ్లండ్ చేరువైంది. మంగళవారం తొలి సెషన్లో మన బౌలర్లు అద్భుతంగా పుంజుకుంటే తప్ప ఈ మ్యాచ్లో టీమ్ఇండియాకు పరాజయం తప్పకపోవచ్చు!!
బర్మింగ్హామ్: ఆధిక్యం చేతులు మారుతూ సాగుతున్న భారత్, ఇంగ్లండ్ ఆఖరి (రీ షెడ్యూల్) టెస్టు రసకందాయంలో పడింది. టీమ్ఇండియా భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంతో ఇక ఈ మ్యాచ్ మనదే అని అభిమానులు అనుకునే లోపే.. ఇంగ్లిష్ ఆటగాళ్లు తొలి వికెట్కు వంద పరుగులు జోడించి పోటీలోకి వచ్చారు. ఆ తర్వాత మూడు పరుగుల వ్యవధిలో 3 వికెట్లు పడగొట్టిన భారత్ తిరిగి ఆధిక్యం చేజిక్కించుకున్నట్లే కనిపిస్తే.. రూట్, బెయిర్స్టో జోడీ టీమ్ఇండియా ఆశలకు అడ్డుకట్ట వేసింది. 378 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఆతిథ్య ఇంగ్లండ్.. సోమవారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది.
ఓపెనర్లు అలెక్స్ లీస్ (56; 8 ఫోర్లు), జాక్ క్రాలీ (46; 7 ఫోర్లు) తొలి వికెట్కు 107 పరుగులు జోడించి ఇంగ్లిష్ జట్టుకు బలమైన పునాది వేయగా.. జో రూట్ (76 బ్యాటింగ్; 9 ఫోర్లు), జానీ బెయిర్స్టో (72 బ్యాటింగ్; 8 ఫోర్లు, ఒక సిక్సర్) అదరగొట్టారు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జంట నాలుగో వికెట్కు అజేయంగా 151 పరుగులు జోడించింది. భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు పడగొట్టాడు. చేతిలో 7 వికెట్లు ఉన్న ఇంగ్లిష్ జట్టు.. విజయానికి 119 పరుగుల దూరంలో ఉంది. అంతకముందు ఓవర్నైట్ స్కోరు 125/3తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. ఆఖరికి 245 వద్ద ఆలౌటైంది. చతేశ్వర్ పుజారా (66; 8 ఫోర్లు), రిషబ్ పంత్ (57; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీలు చేశారు.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 416, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284, భారత్ రెండో ఇన్నింగ్స్: 245 (పుజారా 66, పంత్ 57; స్టోక్స్ 4/33), ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 259/3 (రూట్ 76 బ్యాటింగ్, బెయిర్ స్టో 72 బ్యాటింగ్, బుమ్రా 2/53).