ఇంగ్లండ్ తో జులై 1 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న టెస్టుకు ముందు భారత క్రికెట్ అభిమానులకు భారీ షాక్. భారత జట్టు సారథి రోహిత్ శర్మ ఇంకా కరోనా నుంచి కోలుకోకపోవడంతో అతడు ఈ టెస్టు నుంచి దూరమయ్యాడు. రోహిత్ స్థానంలో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా భారత జట్టు పగ్గాలను చేపట్టనున్నాడని సమాచారం.
పీటీఐలో వచ్చిన సమాచారం మేరకు.. కరోనా బారిన పడ్డ రోహిత్ శర్మ ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. అతడి స్థానాన్ని భర్తీ చేయడానికి గాను టీమ్ మేనేజ్మెంట్ నేడు సమావేశమై రోహిత్ ఆరోగ్య పరిస్థితిపై చర్చించింది. కానీ అతడికింకా విశ్రాంతి కావాలని తేలడంతో ఇంగ్లండ్ తో ఐదో టెస్టుకు బుమ్రాను సారథిగా నియమించారని సమాచారం. దీనిపై ఇప్పటికే టీమ్ మేనేజ్మెంట్ బుమ్రాకు సమాచారం కూడా అందించిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఇదే విషయమై బీసీసీఐకి చెందిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ఈ టెస్టు మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడటం లేదు. ఆర్టీపీసీఆర్ టెస్టులో అతడికి మళ్లీ పాజిటివ్ అని తేలింది. అతడింకా ఐసోలేషన్ లోనే ఉన్నాడు. దీంతో ప్రస్తుతం వైస్ కెప్టెన్ గా ఉన్న జస్ప్రీత్ బుమ్రా ఈ టెస్టుకు సారథిగా ఉంటాడు..’ అని తెలిపాడు.
కాగా.. ఎడ్జబాస్టన్ టెస్టులో టీమిండియాకు బుమ్రా సారథిగా వ్యవహరిస్తే అతడు అరుదైన ఘనతను సాధించబోతున్నాడు. టీమిండియాకు తొలి వన్డే ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ తర్వాత మరే పేసర్ కూడా భారత్ కు టెస్టులలో సారథ్యం వహించలేదు. 35 ఏండ్ల తర్వాత ఇప్పుడు బుమ్రా కపిల్ సరసన చేరనున్నాడు. ఈటెస్టులో సారథిగా ఉండనున్న బుమ్రా.. భారత టెస్టు జట్టుకు 36వ సారథి కానున్నాడు.
ఇండియా-ఇంగ్లండ్ సిరీస్ లో ఇప్పటికే భారత జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ టెస్టు డ్రా అయినా టీమిండియాకు పోయేదేం లేదు. గెలిచినా,డ్రా అయినా సిరీస్ మన సొంతం కానుంది. కానీ ఓడితే మాత్రం సిరీస్ సమం అవుతుంది. టెస్టు తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ తో మూడు వన్డేలు, 3 టీ20లు ఆడాల్సి ఉంది. జులై 7 నుంచి ప్రారంభం కాబోయే ఈ సిరీస్ కైనా హిట్ మ్యాన్ అందుబాటులో ఉంటాడో లేదో చూడాలి.