ఎంతలో ఎంత మార్పు?అతడు క్రీజులో ఉంటే యావత్ భారతావనికి భరోసా ఉండేది! అతడు బరిలోకి దిగుతున్నాడంటే ప్రత్యర్థి బౌలర్ల వెన్నులో వణుకు పుట్టేది! రికార్డులు అతడికి వంగి వంగి సలాం కొట్టేవి!!
ఛేజింగ్ మాస్టర్, పరుగుల యంత్రం, రికార్డుల రారాజు.. ఇలా ఎవరెలా పిలుచుకున్నా.. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి ఆకలిగొన్న పులిలా పరుగుల వరద పారించే అతడి బ్యాట్..చాన్నాళ్లుగా మూగబోయింది!!
బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లవుతాయి అన్న చందంగా.. క్రికెట్ యవనికపై తనదైన ముద్ర వేస్తూ.. చూస్తుండగానే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డులన్నింటికి చేరువైన అతడు.. ప్రస్తుతం ఫామ్లేమితో తంటాలు పడుతున్నాడు!! టెస్టు, వన్డే, టీ20 ఇలా ఫార్మాట్తో సంబంధం లేకుండా.. పేస్, స్పిన్, స్వింగ్ అనే వేరియేషన్స్తో పనిలేకుండా.. స్వదేశమా, విదేశమా అని పట్టించుకోకుండా దశాబ్ద కాలం బౌలర్లకు సింహస్వప్నంలా మారి.. పట్టపగలే చుక్కలు చూపిన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు.
అతడిని జట్టులో నుంచి తొలగిస్తే తప్పేంటని మాజీ కెప్టెన్ కపిల్దేవ్ అంటుంటే.. తిరిగి గాడిన పడటం అతడి స్వంత బాధ్యతే అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. ఏ స్థాయిలోనూ కోహ్లీకి సాటిరాలేని వాళ్ల మాటలకైతే అంతే లేదు. విశ్రాంతి తీసుకుంటే మంచిదని ఒకరు.. రెస్ట్ తీసుకున్నా పెద్దగా ఫలితం ఉండదని మరొకరు.. ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు ఉచిత సలహాలు ఇస్తున్నారు. మూడు ఫార్మాట్లలో 50కి పైగా సగటు సాధించి.. క్రీడాలోకంతో ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్గా మన్ననలందుకున్న కోహ్లీ ప్రస్తుత ఫామ్పై ప్రత్యేక కథనం..
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం:గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ముందు వరకు కోహ్లీ ఆటతీరు బాగానే కనిపించింది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో భారీగా పరుగులు చేయకపోయినా.. జట్టు సమిష్టిగా సత్తాచాటడంతో నాలుగు మ్యాచ్ల్లో 2-1తో ముందంజలో నిలిచిన టీమ్ఇండియా.. ఆఖరి టెస్టు ఆడకుండానే యూఏఈ చేరుకుంది. అక్కడి నుంచి విరాట్పై విమర్శలు ఎక్కువయ్యాయి. సుమారు ఐదేండ్ల తర్వాత జరిగిన పొట్టి ప్రపంచకప్లో విరాట్తో పాటు భారత జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. తొలి మ్యాచ్లోనే దాయాది పాకిస్థాన్ చేతిలో ఘోర పరాజయం జట్టును మానసికంగా దెబ్బతీసింది. ఐసీసీ టోర్నీల్లో పాక్పై ఘనమైన రికార్డు ఉన్న టీమ్ఇండియా.. చిరకాల ప్రత్యర్థి చేతిలో చతికిలబడటం అభిమానులను షాక్కు గురిచేసింది. అయితే ఆ పోరులో మిగిలినవాళ్లు విఫలమైనా.. విరాట్ మాత్రం అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. కాకపోతే మంచినీళ్ల ప్రాయంలా పరుగులు చేసే కోహ్లీ కాస్త నెమ్మదిగా ఆడటం అప్పట్లో విమర్శలకు తావిచ్చింది. ఇక తదుపరి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం ఎదురవడంతో భారత్ నాకౌట్ అవకాశాలకు దూరమైంది. దీంతో అప్పటి వరకు కోహ్లీని పొగిడిన వాళ్లే.. విమర్శలు గుప్పించారు.
రవిభాయ్ వెళ్లిపోవడంతో..
నాలుగైదేండ్లు భారత జట్టుకు కోచ్గా పనిచేసిన రవిశాస్త్రి.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా విరాట్కు వెన్నంటి నిలిచాడు. మైదానం లోపలా, బయటా రవిభాయ్తో చక్కటి అనుబంధం ఉన్న కోహ్లీ.. జట్టును ఒంటిచేత్తో ముందుకు నడిపించాడు. అదే సమయంలో నాణ్యమైన ఆటగాళ్లు అందుబాటులో ఉండటం.. ప్రత్యర్థితో సంబంధం లేకుండా వరుస విజయాలు వరించడం.. కోహ్లీని ప్రపంచ ఉత్తమ ఆటగాడిగా నిలబెట్టాయి. అయితే గతేడాది ప్రపంచకప్ అనంతరం రవిశాస్త్రి కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోగా.. అంతకుముందు నుంచే ఫామ్ కోల్పోయిన విరాట్ పరిస్థితి మరింత కఠినంగా మారింది. ఐపీఎల్ వైఫల్యంతో ప్రపంచకప్ ప్రారంభానికి ముందే పొట్టి ఫార్మాట్ సారథ్యానికి వీడ్కోలు పలుకనున్నట్లు ప్రకటించి కోహ్లీ అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే అంతకుమించిన షాక్ అతడికి బీసీసీఐ ఇచ్చింది. టీ20 కెప్టెన్సీకి దూరమైనా.. వన్డే, టెస్టుల్లో నాయకుడిగా కొనసాగాలనుకున్న కోహ్లీకి నిరాశ తప్పలేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఒకే కెప్టెన్ ఉండాలనే ఉద్దేశంతో వన్డే పగ్గాలు రోహిత్కు అప్పగించింది. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో వైఫల్యంతో టెస్టు సారథ్యానికి వీడ్కోలు పలికిన ‘చీకూ’.. ప్రస్తుతం కేవలం ఆటగాడిగానే జట్టులో కొనసాగుతున్నాడు. కోహ్లీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాక పనిభారం, గాయాలు, కరోనా ఇలా వేర్వేరు కారణాల వల్ల భారత జట్టుకు ఎనిమిది మంది కెప్టెన్లుగా వ్యవహరించాల్సి వచ్చిందనే చర్చ ఇక్కడ అప్రస్తుతం.
జోష్ తగ్గలే!
మైదానంలో చురుగ్గా ఉంటూ ఆటగాళ్లలో ఉత్సాహం నింపే కోహ్లీ.. ప్రస్తుతం ఆటతీరులో వెనుకబడ్డా.. తన ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదనేందుకు తాజా ఇంగ్లండ్ పర్యటనే ఉదాహరణ. సర్కిల్ లోపల ఫీల్డింగ్ చేస్తే తోటి ప్లేయర్లతో సరదాగా గడుపుతూ జోష్ నింపడం.. బౌండ్రీ వద్ద ఉంటే అభిమానులతో కలిసి గంతులేయడంలో కోహ్లీ ఇప్పటికే చురుకుగానే కనిపిస్తున్నాడు. క్రీజులోనూ ఆరంభంలో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తూ.. కొన్ని చక్కటి షాట్లు ఆడిన తర్వాత విరాట్ వెనుదిరుగుతున్నాడు. టెక్నిక్, క్లాస్ పరంగా ఇప్పటికీ, ఎప్పటికీ కోహ్లీని కొట్టేవారు లేరనేది వాస్తవం కాగా.. ఒక్కసారి అతడి ఫామ్ దొరకబుచ్చుకుంటే.. ఇప్పుడొస్తున్న విమర్శలన్నింటికీ బ్యాట్తో సమధానం చెప్తాడనడంలో రవ్వంత అతిశయోక్తి లేదు. కష్టకాలంలో కెప్టెన్ రోహిత్ అతడికి వెన్నంటి నిలువగా.. పాక్ సారథి బాబర్ ఆజమ్ కూడా కోహ్లీకి మద్దతుగా మాట్లాడాడు. యావత్ ప్రపంచం విరాట్ మునుపటి ఫామ్ అందుకోవాలని వేచిచూస్తున్న వేళ.. ఇంగ్లండ్తో ఆఖరి వన్డేలోనైనా.. ‘అభినవ సచిన్’ రాణిస్తాడా చూడాలి!
ఇలా చేస్తే బెటర్!
కెరీర్ ఆరంభంలోనే స్టార్ హోదా దక్కించుకున్న విరాట్.. తిరిగి ఫామ్ అందుకోవాలంటే దేశవాళీ ఆడటమే ఉత్తమమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, మహమ్మద్ అజారుద్దీన్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి ఎందరో గొప్పగొప్ప ఆటగాళ్లు ఫామ్లేమితో సతమతమైనప్పుడు వారంతా చేసిన పని ఇదే. అయితే ప్రస్తుతం బిజీ షెడ్యూల్లో అంతర్జాతీయ ఆటగాళ్లు రంజీ, ముస్తాక్ అలీ, విజయ్ మర్చంట్ వంటీ టోర్నీలు ఆడటమే అరుదైపోయింది. ఇలాంటి తరుణంలో ఆత్మవిశ్వాసం ప్రొది చేసుకొని పూర్వవైభవం తెచ్చుకోవాలంటే విరాట్ దేశవాళీ బాట పట్టడమే సరైన మార్గం!