అహ్మదాబాద్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. అహ్మదాబాద్లో అస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో 35 పరుగులు చేయడం ద్వారా రోహిత్.. 17 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. దాంతో భారత్ తరఫున 17 వేల పరుగుల మైలురాయిని చేరిన ఆరో బ్యాటర్గా రోహిత్ శర్మ గుర్తింపు పొందాడు.
రోహిత్ శర్మ కంటే ముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోని 17 వేల పరుగుల మైలురాయి దాటిన వారిలో ఉన్నారు. సచిన్ టెండూల్కర్ 664 మ్యాచ్లలో 34,357 పరుగులు, విరాట్ కోహ్లీ 494 మ్యాచ్లలో 25,047 పరుగులు, రాహుల్ ద్రవిడ్ 504 మ్యాచ్లలో 24,064 పరుగులు, సౌరవ్ గంగూలీ 421 మ్యాచ్లలో 18,433 పరుగులు, ఎంఎస్ ధోని 535 మ్యాచ్లలో 17,092 పరుగులు చేశారు.
ఇప్పుడు రోహిత్ శర్మ 438వ మ్యాచ్లో 17 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఇవాళ ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టులో శుభ్మాన్ గిల్తో కలిసి తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శుభారంభం ఇచ్చాడు. మొత్తం 58 బంతులను ఎదుర్కొని 35 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ 35 పరుగులతో కలిపి రోహిత్ అంతర్జాతీయ పరుగుల సంఖ్య సరిగ్గా 17 వేలకు చేరింది.