ముంబై: భారత స్టార్ బ్యాటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్తో రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. ఎడమ చేతి బొటనవేలి గాయంతో బాధపడుతున్న రోహిత్ శర్మ.. ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమని బీసీసీఐ మెడికల్ టీమ్ సూచించింది. దాంతో రెండో టెస్టుకు కూడా అతను దూరం కావాల్సి వచ్చింది.
బంగ్లాదేశ్తో రెండో వన్డే మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ బొటనవేలుకు గాయం అయ్యింది. దాంతో మూడో వన్డేకు, తొలి టెస్టుకు రోహిత్ అందుబాటులో లేడు. రెండో టెస్టు (చివరిది కూడా) కల్లా అందుబాటులోకి వస్తాడని ప్రచారం జరిగినా.. గాయం పూర్తిగా నయం కాకపోవడంతో అది కూడా సాధ్యపడలేదు.
ఇక, రోహిత్ శర్మతోపాటే బౌలర్ నవదీప్ సైనీ కూడా బంగ్లాదేశ్తో రెండో టెస్టుకు దూరమయ్యాడు. పొట్ట కండరాలు పట్టేయడంతో జట్టుకు దూరమైన నవదీప్ ఇంకా కోలుకోలేదు. దాంతో రెండో టెస్టుకు కూడా జట్టుతో కలువలేకపోయాడు. దాంతో బీసీసీఐ రెండో టెస్టు కోసం అప్డేటెట్ స్క్వాడ్ను వెల్లడించింది.
ఇండియా టీమ్ అప్డేటెడ్ స్క్వాడ్..
కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్మాన్ గిల్, చటేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, అభిమన్యు ఈశ్వరన్, సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్.