లండన్: టీమిండియా బ్యాటర్ రోహిత్ శర్మ(Rohit Sharma) అంతర్జాతీయ వన్డే కెరీర్ ముగియబోతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంగ్లండ్తో లార్డ్స్లో జరిగే మూడో వన్డే అతని కెరీర్లో చివరి వన్డే అవుతుందని కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. భారత క్రికెట్ సెలెక్టర్లు.. రోహిత్కు ఉద్వాసన పలికే ఆలోచనలో ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్కప్లో అతనికి చోటు దక్కేది అనుమానంగా ఉంది. దీంతో ఇంగ్లండ్ సిరీస్ అతనికి చివరి అవకాశం అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
జూన్లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్ కన్నా ముందే రోహిత్కు సెలెక్టర్లు ఈ విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవానికి రోహిత్ శర్మకు ఇంకా ఆడాలని ఉంది. కానీ కొందరు సెలెక్టర్లు రోహిత్ను ఇంగ్లండ్ సిరీస్ తర్వాత శాశ్వతంగా తప్పించాలని భావిస్తున్న విషయాన్ని ప్రధాన కోచ్ గౌతం గంభీర్ పేర్కొన్నట్లు తెలిసింది. ఇంగ్లండ్తో జరిగే మూడో వన్డే తర్వాత రోహిత్ రిటైర్ అవుతారా లేక వరల్డ్కప్లో ఆడేందుకు ఛాన్సు కోసం ఎదురుచూస్తాడా అన్న విషయం ఇంకా తేలాల్సి ఉన్నది.
మరో వైపు రోహిత్ శర్మ పేరెంట్స్ లార్డ్స్కు వెళ్లారు. రోహిత్ ఫేర్వెల్ వన్డే ఆడనున్న నేపథ్యంలో అతని పేరెంట్స్ అక్కడికి వెళ్లినట్లు కొన్ని వార్తలు వ్యాపించాయి. వన్డేల్లో రోహిత్ స్థానంలో జైస్వాల్కు పర్మనెంట్ ప్లేస్ ఇవ్వాలని బీసీసీఐ ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
రోహిత్ శర్మ 287 వన్డేలు ఆడాడు. వీటిల్లో 11757 రన్స్ చేశాడు. దీంట్లో 33 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.