Rohit Sharma | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో భారత సారథి రోహిత్ శర్మ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. మెగాటోర్నీలో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న పోరులో అఫ్గానిస్థాన్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన రోహిత్.. కేవలం 63 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్ తరఫున వన్డే ప్రపంచకప్లో ఇదే అత్యంత వేగవంతమైన శతకం కాగా.. ఓవరాల్గా మెగాటోర్నీలో రోహిత్కు ఇది ఏడో సెంచరీ. తద్వారా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. 24 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో సచిన్ 6 ప్రపంచకప్లు ఆడి.. ఆరు శతకాలు తన పేరిట లిఖించుకోగా.. రోహిత్ కేవలం 19 ఇన్నింగ్స్ల్లోనే ఆ రికార్డు బద్దలు కొట్టి అగ్రస్థానానికి చేరాడు.
2019లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్లోనే 5 శతకాలు బాది అద్భుతాలు చేసిన రోహిత్.. బుధవారం అఫ్గాన్పై మరో మూడంకెల స్కోరుతో మాస్టర్ను వెనక్కి నెట్టాడు. శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర ఐదు సెంచరీలతో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. మహమ్మద్ నబీ వేసిన 18 ఓవర్లో మొదటి బంతికి ఫోర్ కొట్టి 99 పరుగులకు చేరుకున్న హిట్మ్యాన్.. తర్వాతి బంతికి సింగిల్ తీసి శతకం పూర్తి చేసుకున్నాడు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కెరీర్కు వీడ్కోలు పలికిన సమయంలో ఎదురైన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. ‘రికార్డులు ఉన్నవే బద్దలు అవడానికి. నేను సాధించిన ఘనతలు కూడా ఏదో ఒక రోజు కనుమరుగవుతాయి. అయితే అవి ఓ భారతీయుడి చేతిలో అయితే నేను మరింత సంతోషిస్తా. సెంచరీల విషయానికి వస్తే.. టీమ్ఇండియా ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలో ఆ సత్తా ఉంది. వారిద్దరిలో ఒకరు నా రికార్డులు బద్దలు కొట్టాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు. ఇప్పుడు మాస్టర్ మాటలను అక్షరాల నిజం చేస్తూ.. ప్రపంచకప్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా రోహిత్ నయా రికార్డు నెలకొల్పాడు.