Rohit Sharma | టీం ఇండియా టెస్ట్ టీం సారధ్యం హిట్మ్యాన్ హస్తగతమైంది. దీంతో మూడు ఫార్మాట్లలోనూ టీం ఇండియాకు రోహిత్ శర్మ సారధ్యం వహించనున్నారు. శ్రీలంకతో జరిగి 3 మ్యాచ్ల టీ-20 సిరీస్, టెస్ట్ సిరీస్కు టీం ఇండియా జట్టును ఎంపిక చేసినట్లు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ శనివారం మీడియాకు చెప్పారు. శ్రీలంకతో టీ-20 సిరీస్కు టీం ఇండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ, రిషబ్పంత్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది.
ఛతేశ్వర్ పుజారా, అజ్యింక రహానేతోపాటు నలుగురు సీనియర్ ప్లేయర్లను టెస్ట్ టీం నుంచి తప్పించింది. చాలా కాలంగా, పుజారా, రహానే ఫామ్లో లేకపోవడంతోనే వారిని పక్కన బెట్టినట్లు తెలుస్తున్నది. వీరిద్దరినీ తప్పిస్తారని కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి. టెస్ట్ టీం వెల్లడించడానికి ముందు రంజీ ట్రోఫీలో సౌరాష్ట్రపై రహానే సెంచరీ చేయగా, ఛతేశ్వర్ పుజారా డకౌట్ అయ్యాడు. వీరిద్దరినీ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు అనుమతించామని చేతన్శర్మ వెల్లడించారు.
పుజారా, రహానేలతోపాటు ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ, వికెట్ కీపర్ వృద్ధమాన్ సాహాలను టెస్ట్ సిరీస్కు పక్కన బెట్టారు. కొంత కాలంగా ఇషాంత్ శర్మ ఫిట్నెస్, ఫామ్ సమస్యలతో బాధపడుతున్నాడు. వృద్ధమాన్ సాహా స్థానాన్ని యువ కీపర్ కేఎస్ భారత్ భర్తీ చేశాడు.
దాదాపు ఏడు నెలల తర్వాత సంజూ శామ్సన్ జాతీయ జట్టులోకి వచ్చాడు. శ్రీలంకకు వ్యతిరేకంగా జరిగే టీ-20 సిరీస్ జట్టుకు ఎంపికయ్యాడు. గతేడాది శ్రీలంకలో టూర్ తర్వాత టీ-20, వన్డే టీంల నుంచి సంజూ శామ్సన్లను బీసీసీఐ తప్పించింది. ఇక ఇషాన్ కిషన్తో కలిసి సంజూ శామ్సన్ రెండో వికెట్ కీపర్ పాత్ర పోసించనున్నాడు. ఇప్పటి వరకు 10 టీ-20 మ్యాచ్ల్లో 117 పరుగులు చేశాడు. ఆయన స్ట్రైక్ రేట్ 110.38 పరుగులుగా ఉంది.
శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టీం ఇండియా పాల్గొంటుంది. తొలిసారి టెస్ట్ మ్యాచ్కు రోహిత్ శర్మ సారధ్యం వహించనున్నారని చేతన్ శర్మ చెప్పారు. 2013లో తొలిసారి టీం ఇండియా తరఫున శ్రీలంకపై రోహిత్ తొలి టెస్ట్ ఆడాడు. ఇప్పుడు టీం ఇండియా 35వ టెస్ట్ సారధిగా శ్రీలంకపై టీంకు సారధ్యం వహించనున్నాడు. వచ్చేనెల నాలుగో తేదీన మొహాలీలో ఇండియా-శ్రీలంక మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది.
ఇటీవల సఫారీలతో దక్షిణాఫ్రికాలో జరిగిన టెస్ట్ సిరీస్లో టీం ఇండియా ఓటమి పాలైన తర్వాత విరాట్ కోహ్లీ.. టెస్ట్ ఫార్మాట్లో కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఆ తర్వాత టెస్ట్ టీం సారధిగా రోహిత్ శర్మను ఎంపిక చేశారు. కోహ్లీ కెప్టెన్సీకి రాజీనామా చేసిన తర్వాత టీం ఇండియా సారధి ఎవరన్న చర్చ సాగింది. హిట్మ్యాన్ రోహిత్ శర్మతోపాటు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా తదితరుల పేర్లు వినిపించాయి.
టీం ఇండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ రిషబ్ పంత్లకు బీసీసీఐ పూర్తిగా విశ్రాంతి ఇచ్చింది. ఇద్దరు ఆటగాళ్లకు 10 రోజుల విశ్రాంతి ఇచ్చారు. శ్రీలంకతో టీ-20 సిరీస్కు వీరు దూరంగా ఉంటారు. విరాట్ కోహ్లీ శనివారం ఉదయమే ఇంటికి వెళ్లాడని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ఇప్పటికే వెస్టిండీస్తో టీ-20 సిరీస్ను బారత్ కైవసం చేసుకోవడంతో అన్ని ఫార్మాట్లలో ఆడే రెగ్యులర్ ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. క్రికెటర్ల మానసిక ఆరోగ్యాన్న పరిగణనలోకి తీసుకోవాలని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. వీరిద్దరితోపాటు శార్దూల్ ఠాకూర్కు పూర్తిగా విశ్రాంతి ఇచ్చినట్లు తెలిపారు.
భారత్లో శ్రీలంక జట్టు టూర్ ఈ నెల 24 నుంచి మొదలవుతుంది. టీం ఇండియా, శ్రీలంక మధ్య టెస్ట్ సిరీస్, టీ-20 సిరీస్ బీసీసీఐ ప్రకటించింది. రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ మొహాలీలో ప్రారంభం కానున్నది. మొహాలీలో మాజీ సారధి విరాట్ కోహ్లీ తన 100వ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు.