T20 World Cup | ఈ ఏడాది ఐఐసీ టీ20 వరల్డ్ కప్ జరుగనున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్-2024 తర్వాత భారత్ జట్టు మెగా ఈవెంట్లో పాల్గొనున్నది. అయితే, జూన్ 2 నుంచి మొదలవనున్నది. అయితే, టోర్నీకి సంబంధించి మే 1న ఆటగాళ్ల జాబితాను పంపాల్సి ఉంది. భారత జట్టు ఎంపికపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. టీమ్ సెలక్షన్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య సమావేశం జరిగినట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్కు సంబంధించిన పేర్లను చర్చించినట్లు పలు నివేదికలు తెలిపాయి. అయితే, ఈ ఊహాగానాలను కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిపడేశాడు. తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. టీ20 ప్రపంచకప్ జట్టు కోసం రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్తో ఈ నెల 27న సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఆ తర్వాత సెలెక్టర్లు తర్వాత జట్టును ప్రకటిస్తారని తెలుస్తున్నది.
ఐసీసీకి మే ఒకటి వరకు 15 మంది ఆటగాళ్ల జాబితాను ఎంపిక చేసేందుకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఢిల్లీలో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలస్తున్నది. 27న భేటీ జరుగకపోతే మరుసటి రోజునే ఢిల్లీలో సమావేశమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. ముంబయి ఇండియన్స్ 27న ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ ఆడాల్సింది. ప్రస్తుతం సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కార్ విదేశాలకు వెళ్లాడు. 27న జరిగే భేటీ కోసం నేరుగా ఢిల్లీకి చేరుకుంటాడని సమాచారం. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ ఎంపిక దాదాపు ఖాయమని తెలుస్తున్నది. అదే సమయంలో రోహిత్కి ఓపెనింగ్ పార్ట్నర్ ఎవరికి ఛాన్స్ ఎవరనేది సందేహాస్పదంగా మారింది. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్లో ఎవరికి అవకాశం దక్కుతుందో వేచి చూడాల్సిందే.
ప్రస్తుతం ఐపీఎల్లో యశస్వీ జైస్వాల్ ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. అదే సమయంలో శుభ్మన్ గిల్ ప్రదర్శన చెప్పుకోవాల్సినంతగా ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విరాట్, రోహిత్ ఓపెనింగ్స్ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ సైతం జోరుగా సాగుతోంది. అదే సమయంలో శుభ్మన్-యశస్విలలో ఒకరు బ్యాకప్ ఓపెనర్గా తీసుకునే అవకాశం ఉన్నది. ఈ పరిస్థితుల్లో నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్, శివమ్ దూబే, రింకూ సింగ్ ఎవరో ఒకరికి అవకాశం లభించే ఛాన్స్ ఉంది. సూర్యకుమార్ మూడో స్థానంలో ఆడటం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తున్నది. అదే సమయంలో రిషబ్ పంత్ ఐదు స్థానంలో బ్యాటింగ్కు వచ్చే ఛాన్స్ ఉంది. హార్దిక్ పాండ్యా ఫామ్ సైతం సెలక్టర్లను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటి వరకు పాండ్యా తన ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయాడు. ఆరో స్థానంలో పవర్ హిట్టర్కు.. ఏడో స్థానంలో జడేలా, హార్దిక్ ఎనిమిదో స్థానంలో తీసుకోవచ్చని.. మిగతా మూడు స్థానాల్లో బూమ్రాతో పాటు అవేశ్ ఖాన్, సిరాజ్, అర్షదీప్ సింగ్ పోటీపడుతున్నారు.