లండన్: స్విస్ దిగ్గజం, 20 గ్రాండ్స్లామ్ టైటిళ్ల విజేత రోజర్ ఫెదరర్ వింబుల్డన్ టోర్నీ తొలి రౌండ్లో గట్టెక్కాడు. చెరో రెండు సెట్లు గెలిచిన తరుణంలో ప్రత్యర్థి ఆడ్రియన్ మానారినో (ప్రాన్స్) కాలుజారి గాయపడి నిష్క్రమించడంతో ఫెడ్ రెండో రౌండ్ చేరుకున్నాడు. మంగళవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్లో తొలి సెట్ 6-4తో నెగ్గిన ఫెదరర్ అనంతరం 6-7 (3/7), 3-6తో వరుసగా రెండు సెట్లు కోల్పోయాడు. 6-2తో నాలుగో సెట్ గెలిచి మ్యాచ్ను నిలుపుకున్నాడు. అయితే సెట్ పాయింట్ను అడ్డుకునే ప్రయత్నంలో ఆడ్రియన్ గాయపడ్డాడు. రెండు శస్త్రచికిత్సలు, నాలుగు సంవత్సరాల విరామం తర్వాత వింబుల్డన్లో అడుగుపెట్టిన బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే తొలి రౌండ్లో విజయం సాధించగా.. నాలుగో సీడ్ జ్వెరెవ్ కూడా రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. మహిళల సింగిల్స్లో టాప్ ర్యాంకర్ ఆష్లే బార్టీ, కరోలినా ప్లిస్కోవా తొలి రౌండ్లో విజయాలు సాధించారు. కరోనా వైరస్కు ఆక్స్ఫర్డ్ – ఆస్ట్రాజెనికా టీకా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్త సారా గిల్బెర్ట్ వింబుల్డన్ పోటీలను చూసేందుకు స్టేడియానికి రాగా ప్రేక్షకులు నిలబడి చప్పట్లతో ఆమెను అభినందించారు.