డెహ్రాడూన్ : కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమ్ఇండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ ఆరోగ్యం కుదుటపడుతున్నది. ప్రమాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పంత్ను సోమవారం ఐసీయూ నుంచి ప్రైవేట్ వార్డుకు తరలించారు. నుదురు, వెన్ను, మోకాలుకు గాయాలు కావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వివిధ పరీక్షల్లో ఎలాంటి ప్రమాదం లేదని తేల్చిన డాక్టర్లు పంత్ను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. పంత్ను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ పరామర్శించారు.
డ్రైవర్లను పెట్టుకోండి: కపిల్దేవ్
యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో దిగ్గజం కపిల్దేవ్ పలు కీలక సూచనలు చేశాడు. ‘ప్రమాదాల బారిన పడకుండా ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా యువ క్రికెటర్లు సొంతంగా వాహనాలు నడపడం కన్నా..డ్రైవర్లను పెట్టుకోవాలి. వారికి ఆ స్థోమత ఉంది. కెరీర్ తొలినాళ్లలో బైక్ ప్రమాదంలో నేను గాయపడ్డాను. అప్పటి నుంచి నా సోదరుడు మళ్లీ నన్ను డ్రైవింగ్ చేయనివ్వలేదు’ అని అన్నాడు.