Rishabh Pant Re entry | టీమిండియాతో పాటు ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్కు భారత క్రికెట్ జట్టు మాజీ సారథి సౌరవ్ గంగూలీ గుడ్న్యూస్ చెప్పాడు. 15 నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై పూర్తిస్థాయిలో కోలుకున్న యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ త్వరలోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడన్న విషయాన్ని దాదా స్పష్టం చేశాడు. మరో రెండురోజుల్లోనే పంత్.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఫిట్నెస్ టెస్టుకు హాజరుకానున్నాడని.. అది క్లీయర్ అయితే రాబోయే సీజన్లో అతడి రోల్పై క్లారిటీ వస్తుందని దాదా అన్నాడు.
ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్కు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా ఉన్న గంగూలీ శనివారం ఓ జాతీయ పత్రికతో మాట్లాడుతూ… ‘రోడ్డు ప్రమాదం నుంచి దాదా పూర్తిస్థాయిలో కోలుకున్నాడు. మార్చి 5న అతడు ఎన్సీఏలో ఫిట్నెస్ టెస్టుకు హాజరుకావాల్సి ఉంది..’ అని అన్నాడు. మార్చి 22 నుంచి ఐపీఎల్-17 మొదలుకావాల్సి ఉండగా ఈ సీజన్లో పంత్ కేవలం బ్యాటింగ్కే పరిమితమవుతాడా..? లేక వికెట్ కీపింగ్ కూడా చేస్తాడా..? అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ విషయంలో కూడా అతడి ఫిట్నెస్ టెస్టు తర్వాతే స్పష్టత వస్తుందని గంగూలీ అన్నాడు.
‘ముందైతే పంత్ను ఫిట్నెస్ టెస్టు క్లీయర్ చేయనివ్వండి. ఆ తర్వాతే అతడు సారథిగా ఉంటూ బ్యాటర్గా బరిలోకి దిగుతాడా..? లేక వికెట్ కీపింగ్ చేస్తాడా..? అన్నదానిపై మాకు స్సష్టత వస్తుంది. పంత్ ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో కోలుకుంటుండగా అతడిని వచ్చీ రావడంతోనే అదనపు బాధ్యతలు పెట్టి ఒత్తిడికి గురిచేయడం సరికాదు. అతడికి సుదీర్ఘమైన కెరీర్ ఉంది. దానిని దృష్టిలో పెట్టుకుని మేం నిర్ణయం తీసుకుంటాం. మా జట్టు (ఢిల్లీ క్యాపిటల్స్)లో కుమార్ కుషాగ్ర, రికీ భుయ్, షై హోప్, ట్రిస్టన్ స్టబ్స్ల రూపంలో వికెట్ కీపర్లు ఉన్నారు..’ అని తెలిపాడు.
ఇదిలాఉండగా ఐపీఎల్-17 తొలి విడత షెడ్యూల్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. మార్చి 23న ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. పంత్ రీఎంట్రీ మ్యాచ్ ఇదే అవనుందని వార్తలు వస్తున్నాయి.