Ricky Ponting : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ అంటే చాలు మాజీ క్రికెటర్లు, అభిమానుల్లో ఎక్కడ లేని ఆసక్తి ఉంటుంది. కారణం.. ప్రపంచలోనే అత్యుత్తమ జట్లు తలపడున్న సిరీస్ ఇది. ఈ సిరీస్లో అత్యధిక పరుగుల వీరుడు ఎవరు? అత్యధిక వికెట్లు పడగొట్టే బౌలర్ ఎవరు? అని అందరూ చర్చించుకుంటారు. అయితే.. ఈ సిరీస్లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అత్యధిక వికెట్లు తీస్తాడని మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన జడ్డూ, ఆసీస్ బ్యాటర్లను పీడకలలా వెంటాడతాడని అతను తెలిపాడు. ఐసీసీ రివ్యూతో మాట్లాడుతూ.. ‘ఈ సిరీస్లో జడేజా ఎక్కువ వికెట్లు తీస్తాడని నేను భావిస్తున్నా.
ఆస్ట్రేలియాను ఓడించేందుకు స్పిన్ పిచ్లు రూపొందించడం భారత్ ముందున్న మంచి అవకాశం’ అని పాంటింగ్ అన్నాడు. అంతేకాదు జడేజా సక్సెస్కు కారణం ఏంటో కూడా చెప్పుకొచ్చాడు. ఇలాంటి పిచ్ల మీద జడేజా అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు.
‘పేస్, లైన్ అండ్ లెంగ్త్కు కట్టుబడి జడేజా బంతులు సంధిస్తాడు. ముఖ్యంగా కుడి చేతివాటం బ్యాటర్లకు సరైన ప్రాంతాల్లో బౌలింగ్ చేస్తాడు. ప్రతిసారి స్టంప్స్ను లక్ష్యంగా చేసుకుంటాడు. ఒక బంతి టర్న్ అవుతుంది. మరొకటి స్ట్రయిట్గా వెళ్తుంది. అలాంటి బంతితోనే స్టీవ్ స్మిత్ను అతను బౌల్డ్ చేశాడు’ అని పాంటింగ్ అన్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ను జడేజా వణికించాడు. ఐదు వికెట్లు తీసి ఆ జట్టును దెబ్బ తీశాడు. నంబర్ 1 ఆల్రౌండర్ అయిన జడ్డూ ఈ ఫార్మాట్లో 5 వికెట్ల ప్రదర్శన చేయడం ఇది 11వ సారి.