ముంబై: భారత క్రికెట్ జట్టుకు చీఫ్ కోచ్ కావాలని బీసీసీఐ ఇటీవల ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే హెడ్ కోచ్ పదవి చేపట్టేందుకు బీసీసీఐకి చెందిన ఓ వ్యక్తి ఆస్ట్రేలియా క్రికెటర్ రికీ పాంటింగ్(Ricky Ponting)ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆసీస్ దిగ్గర బ్యాటర్ రికీ కూడా కన్ఫర్మ్ చేశాడు. ప్రస్తుతం హెడ్కోచ్ రాహుల్ ద్రావిడ్ జూన్లో రిటైర్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ కోసం బీసీసీఐ వెతుకులాట ప్రారంభించింది.
మే 13వ తేదీన హెడ్కోచ్ పదవి కోసం బీసీసీఐ ప్రకటన ఇచ్చింది. ఐపీఎల్ జరుగుతున్న సమయంలో బీసీసీఐ అధికారులతో తనతో కోచ్ పదవి గురించి చర్చించినట్లు రికీ తెలిపాడు. దీని గురించి రిపోర్టులు వచ్చాయని, సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు వ్యాపిస్తుంటాయని, అయితే కోచింగ్ బాధ్యతల గురించి ఓ బీసీసీఐ వ్యక్తితో సంప్రదింపులు జరిగినట్లు పాంటింగ్ తెలిపాడు. సీనియర్ జట్టుకు కోచింగ్ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తిగానే ఉన్నా.. ప్రస్తుతం కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడుతున్నట్లు 48 ఏళ్ల రికీ వెల్లడించాడు.
గతంలో 2019లో ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్గా చేశాడు. టీ20 జట్టుకు తాత్కాలిక కోచ్గా కూడా చేశాడు. ప్రస్తుతం 2018 నుంచి ఐపీఎల్లో డీసీ జట్టుకు హెడ్కోచ్గా చేస్తున్నాడు. హెడ్కోచ్ పాత్రను పోషించేందుకు మరో ఆసీస్ బ్యాటర్ జస్టిన్ లాంగర్, లంక క్రికెటర్ జయవర్దనే, కివీస్ క్రికెటర్ ఫ్లెమింగ్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. భారత క్రికెటర్లలో గౌతమ్ గంభీర్ కూడా పోటీపడుతున్నట్లు తెలుస్తోంది.