హాకీకి వీడ్కోలు పలికిన టోక్యో కాంస్య విజేతలు
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గిన భారత హాకీ జట్టు సభ్యులైన రూపిందర్ పాల్ సింగ్, బీరేంద్ర లక్రా కెరీర్కు వీడ్కోలు పలికారు. యువ ఆటగాళ్లకు దారి ఇచ్చేందుకే తప్పుకుంటున్నట్లు రూపిందర్ ట్విట్టర్లో వెల్లడించగా.. కాసేపటికే బీరేంద్ర లక్రా కూడా తన సహచరుడి బాటలోనే నడుస్తానని ప్రకటించాడు. వీరిద్దరి రిటైర్మెంట్ను గురువారం హాకీ ఇండియా (హెచ్ఐ) అమోదించింది. భవిష్యత్తు ప్రణాళికలో ఈ ఇద్దరికి భాగం లేదని తెలియడంతోనే వీరు ఆటకు వీడ్కోలు పలికినట్లు సమాచారం. స్టార్ డ్రాగ్ఫ్లికర్ రూపిందర్పాల్ సింగ్ జాతీయ జట్టు తరఫున 223 మ్యాచ్లు ఆడగా.. డిఫెండర్ లక్రా 201 మ్యాచ్ల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ‘గత మూడు నెలలు నా జీవితంలో ఎంతో మధురమైనవి. టోక్యో ఒలింపిక్స్లో పతకం నెగ్గడం ఎప్పటికీ మరువలేను. యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే సమయం వచ్చేసింది’ అని రూపిందర్ పేర్కొనగా.. ‘13 ఏండ్లు దేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. నా కెరీర్ ఇన్నేండ్లు సాగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని లక్రా తెలిపాడు.