హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీలో హైదరాబాద్ వరుస పరాజయాల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. ప్రత్యర్థికి కనీసం పోటీనివ్వలేకపోతున్న హైదరాబాద్ పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతున్నది. జింఖానా వేదికగా జరిగిన గ్రూపు-బి మ్యాచ్లో హైదరాబాద్ ఇన్నింగ్స్ 57 పరుగుల తేడాతో సౌరాష్ట్ర చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. రెండంటే రెండు రోజుల్లోనే మనోళ్ల పోరాటం ముగిసిందంటే ఆటతీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారీ వెనుకంజతో రెండో ఇన్నింగ్స్కు దిగిన హైదరాబాద్ 191 పరుగులకే కుప్పకూలింది. పిచ్ పరిస్థితులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ధర్మేంద్రసిన్హ్ జడేజా (4/34), జైదేవ్ ఉనద్కట్ (3/62) విజృంభించడంతో హైదరాబాద్ ఏ దశలోనూ నిలదొక్కుకోలేకపోయింది. లంచ్ విరామ సమయానికే హైదరాబాద్ సగం వికెట్లు చేజార్చుకుంది. తోలకంటి గౌడ్ (58) ఒంటరి పోరాటం వృథా అయ్యింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 250/5తో రెండోరోజు ఆట కొనసాగించిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 327 పరుగులకు ఆలౌటైంది. అనికేత్రెడ్డి(7/95) ఏడు వికెట్లతో ఆకట్టుకున్నాడు.