WPL 2024 | మహిళల ప్రీమియర్ లీగ్ -2024లో మంగళవారం గుజరాత్ జెయింట్స్ జట్టుపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి గుజరాత్ జెయింట్స్ విధించిన 108 పరుగుల విజయ లక్ష్యాన్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కేవలం 12.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి చేరుకున్నది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ ఏడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. 108 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 45 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సొంతం చేసుకున్నది.
108 పరుగుల లక్ష్యంతో బెంగళూరు సారధి స్మ్రుతి మందానా, సోఫీ డివైన్ కలిసి బ్యాటింగ్ చేపట్టారు. మందాన 43 పరుగులకు తనూజా కన్వర్ బౌలింగ్ లో బౌల్డ్ పెవిలియన్ దారి పట్టారు. సోఫీ డివైన్ ఆరు పరుగులకే ఔటయినా, సాభినేని మేఘనా, ఎల్లీసీ పెర్రీ నిలకడగా ఆడుతూ 36, 23 పరుగులు చేశారు. గుజరాత్ జెయింట్స్ బౌలర్లు ఆష్ లెగ్ గార్డనర్, తనూజా కన్వర్ చెరో వికెట్ తీశారు.తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ బ్యాటర్లలో దయాలన్ హేమలత 31, హార్లీన్ డియోల్ 22 పరుగులు మినహా మిగతా వారెవ్వరూ క్రీజ్ లో నిలవలేక పోయారు. బెంగళూరు బౌలర్లలో సోపీ మోలిన్యూక్స్ మూడు, రేణుకాసింగ్ రెండు, జార్జియా వారెహమ్ ఒక వికెట్ తీసుకున్నారు.