రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కప్ కల నెరవేరింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ ఆర్సీబీ..డబ్ల్యూపీఎల్ టైటిల్ను తొలిసారి సగర్వంగా ముద్దాడింది. 30వేల మంది ప్రేక్షకుల మధ్య జరిగిన ఫైనల్ ఫైట్లో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తుచేస్తూ లీగ్ విజేతగా నిలిచింది. శ్రేయాంకపాటిల్, మిలోనెక్స్ విజృంభణతో ఢిల్లీ 113 పరుగులకే కుప్పకూలింది. షెఫాలీవర్మ మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. స్వల్ప లక్ష్యఛేదనలో ఎలీస్ పెర్రీ, సోఫీ డివైన్ రాణించడంతో ఆర్సీబీ అలవోక విజయాన్నందుకుంది. మొత్తంగా ‘ఈ సాలా కప్ నమదే’ అన్న స్లోగన్ను ఆర్సీబీ అమ్మాయిలు చేతల్లో చూపెట్టగా, ఇక అబ్బాయిల వంతు మిగిలింది.
WPL | న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) చాంపియన్గా నిలిచింది. టైటిల్ ఫైట్లో నిలిచిన తొలిసారే టైటిల్ను దక్కించుకుంది. ఆదివారం జరిగిన తుదిపోరులో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై ఘన విజయం సాధించింది. తొలుత ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. శ్రేయాంక పాటిల్ (4-12), సోఫీ మిలోనెక్స్(3-20)..ఢిల్లీ పతనాన్ని శాసించారు. షెఫాలీవర్మ(44), మెగ్ ల్యానింగ్ (23) ఆకట్టుకోగా, రోడ్రిగ్స్(0), కాప్సె (0), కాప్ (8), జొనాసెన్ (3), రాధాయాదవ్ (12) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు 19.3 ఓవర్లలో 115-2 స్కోరు చేసింది. ఎలీస్ పెర్రీ(35 నాటౌట్), డివైన్(32) రాణించారు. శిఖాపాండే, మణి ఒక్కో వికెట్ తీశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా మిలోనెక్స్, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా దీప్తిశర్మ నిలిచారు.
ఢిల్లీ ఢమాల్: తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ తమదైన రీతిలో దూకుడైన ఆటతీరు కొనసాగించింది. ఓపెనర్లు కెప్టెన్ మెగ్ ల్యానింగ్, షెఫాలీవర్మ..బెంగళూరు బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ ఆది నుంచే చెలరేగారు. మిలోనెక్స్ బౌలింగ్లో భారీ సిక్స్తో బౌండరీల ఖాతా తెరిచిన షెఫాలీ..రేణుకాసింగ్ను కూడా అరుసుకుంది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో షెఫాలీ భారీ సిక్స్ బాదితే..తానేం తక్కువ కాదన్నట్లు ల్యానింగ్ వరుసగా రెండు ఫోర్లతో విరుచుకుపడింది.
అదే జోరు కొనసాగిస్తూ పెర్రీ వేసిన మరుసటి ఓవర్లోనూ షెఫాలీ..ఓ సిక్స్, ఫోర్తో స్కోరుబోర్డును పరుగులు పెట్టించింది. మరో ఎండ్లో ల్యానింగ్ కూడా జత కలువడంతో పవర్ప్లే ముగిసే సరికి ఢిల్లీ వికెట్ కోల్పోకుండా 61 పరుగులు చేసింది. వేర్హామ్ వేసిన ఏడో ఓవర్లో ఢిల్లీ మూడు పరుగులకే పరిమితం కాగా, మిలోనెక్స్ వేసిన ఎనిమిదో ఓవర్ ఢిల్లీ వికెట్ల పతనానికి తెరతీసింది. మిలోనెక్స్ తొలి బంతికే షెఫాలీ..క్యాచ్ ఔట్ కాగా, బంతి తేడాతో జెమీమా రోడ్రిగ్స్(0), క్యాప్సె(0) ఇద్దరు క్లీన్బౌల్డ్ అయ్యారు. అప్పటి వరకు వికెట్ కోల్పోకుండా భారీ స్కోరు దిశగా సాగుతున్నట్లు కనిపించిన ఢిల్లీ..ఒకే ఓవర్లో మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
టాపార్డర్ను మిలోనెక్స్ కూలిస్తే.. మిడిలార్డర్ను శ్రేయాంక పాటిల్ పని పట్టింది. ల్యా నింగ్ను శ్రేయాంక ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ పంపింది. ఆశా శోభన 14వ ఓవర్లో కాప్(8), జొనాసెన్ (3)ను ఔట్ చేసి పోటీలోకి వచ్చింది. ఆ తర్వాత మిన్నుమణి (5), రాధా యాదవ్ (12), అరుంధతిరెడ్డి (10), తానియా భాటియా (0) వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోరుకు పరిమితమైంది. ఒక దశలో 61-0 స్కోరుతో మెరుగ్గా కనిపించిన ఢిల్లీ..49 పరుగుల తేడాతో 10 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్కు దాదాపు 30వేల మంది ప్రేక్షకులు స్టేడియానికి తరలివచ్చారు.
ఆడుతూ పాడుతూ: ఢిల్లీ నిర్దేశించిన స్వల్ప లక్ష్యఛేదనను బెంగళూరు ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్ల స్మృతి మందన, సోఫీ డివైన్ మెరుగైన శుభారంభం అందించారు. ఢిల్లీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ బౌండరీలతో అలరించారు. తొలి వికెట్కు 49 పరుగులు జోడించిన ఆర్సీబీ..పెర్రీ సాధికారిక ఇన్నింగ్స్తో అలవోకగా గెలిచింది. మందన ఔటైనా.. పెర్రీతో కలిసి రీచా ఘోష్(17 నాటౌ ట్) జట్టును గెలిపించి సంబురాల్లో నిలిపింది.
1 ఫ్రాంచైజీ పరంగా ఆర్సీబీకి ఇది తొలి టైటిల్.
9 ఢిల్లీతో ఫైనల్లో ఆర్సీబీ స్పిన్నర్లు తీసిన వికెట్లు. డబ్ల్యూపీఎల్లో ఒక జట్టులో స్పిన్నర్లు పడగొట్టిన అత్యధిక వికెట్లుగా రికార్డుల్లోకెక్కింది.
ఢిల్లీ: 18.3 ఓవర్లలో 113 ఆలౌట్ (షెఫాలీవర్మ 44, ల్యానింగ్ 23, శ్రేయాంక 4-12, మిలోనెక్స్ 3-20),
బెంగళూరు: 19.3 ఓవర్లలో 115-2(పెర్రీ 35 నాటౌట్, డివైన్ 32, శిఖాపాండే 1-11, మణి 1-12).