గత ఐదు సార్లు బెంగళూరు, రాజస్థాన్ తలపడితే.. ఐదు సార్లూ బెంగళూరే విజయం సాధించింది. ఆ ఓటములకు సంజూ సేన ప్రతీకారం తీర్చుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్.. రియాన్ పరాగ్ (56 నాటౌట్) తప్ప మిగతా బ్యాటర్లు విఫలం అవడంతో.. 8 వికెట్ల నష్టానికి 144 పరుగులే చేయగలిగింది.
లక్ష్య ఛేదనలో బెంగళూరు జట్టు ఏమాత్రం పోరాటం చూపించలేకపోయింది. కోహ్లీ (9) మరోసారి విఫలమవగా.. మ్యాక్స్వెల్ (0) కూడా పూర్తిగా నిరాశపరిచాడు. డుప్లెసిస్ (23) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. రజత్ పటీదార్ (16), షాబాజ్ అహ్మద్ (17) కూడా జట్టును కాపాడలేకపోయారు. దినేష్ కార్తీక్ (6) రనౌట్ అవడంతో బెంగళూరు విజయావకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి.
చివరి ఓవర్లో భారీ షాట్కు యత్నించిన హర్షల్ పటేల్ (8) కూడా అవుటవడంతో ఆ జట్టు 115 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో రాజస్థాన్ జట్టు 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరుపై ఐదు ఓటముల తర్వాత ఆ జట్టుకు దక్కిన తొలి విజయమిది.
బెంగళూరు బౌలర్లలో యువ పేసర్ కుల్దీప్ సేన్ 4 వికెట్లతో చెలరేగాడు. అశ్విన్ 3, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీసుకున్నారు. ఇది బెంగళూరుకు వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం. రెండు మ్యాచుల్లోనూ బెంగళూరు బౌలర్లు పోరాడినా.. బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఆ జట్టు ఓటములు చవి చూసింది.