ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఈసారి వరుస ఓటములతో సీజన్ ప్రారంభించింది. తొలి మ్యాచ్లో కోల్కతా చేతిలో ఓడిన చెన్నై, రెండో మ్యాచులో కొత్త జట్టు లక్నో చేతిలో ఆరు వికెట్ల ఓటమిని మూటగట్టుకుంది. గురువారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు రాబిన్ ఊతప్ప (50), శివమ్ దూబే (49)తోపాటు మిగతా బ్యాటర్లు కూడా సత్తా చాటడంతో 210 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అయితే మంచు ప్రభావం వల్ల బౌలింగ్ సమయంలో కొంచెం ఇబ్బంది పడింది. అదే సమయంలో లక్నో ఓపెనర్లు క్వింటన్ డీకాక్ (61), కేఎల్ రాహుల్ (40) ఏకంగా 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీళ్లిద్దరికీ చెన్నై ఫీల్డింగ్ తప్పిదాల వల్ల లైఫ్ లభించింది. డీకాక్ ఇచ్చిన సులభమైన క్యాచ్ను మొయీన్ అలీ జారవిడవగా.. రాహుల్ గాల్లోకి కొట్టిన బంతిని డీప్ పాయింట్లో తుషార్ దేష్పాండే అందుకోలేకపోయాడు.
ఇలాంటి క్యాచులు అందుకుంటేనే మ్యాచ్లు గెలుస్తామని చెన్నై కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా అభిప్రాయపడ్డాడు. మంచు ప్రభావం వల్ల చేతుల్లో బంతి నిలవలేదని, ఇకపై తడి బంతితో కూడా ప్రాక్టీస్ చేస్తామని చెప్పాడు. అలాగే బ్యాటింగ్ విభాగం అద్భుతంగా రాణించిందని, బౌలింగ్ విభాగం కొంత శ్రమించి ప్లాన్లు పక్కాగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నాడు. చెన్నై జట్టు పగ్గాలు అందుకున్న తర్వాత జడేజా వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే.