దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో భారత క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్, మయాంక్ అగర్వాల్, శుభ్మన్ గిల్ తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ టెస్టు బౌలింగ్, ఆల్రౌండర్ ర్యాంకుల్లో రెండో ర్యాంక్కు చేరుకున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన అశ్విన్ బౌలర్గానే కాదు ఆల్రౌండర్గాను ర్యాంక్ను మెరుగుపర్చుకోవడం విశేషం. ఐసీసీ బుధవారం టెస్టు ర్యాంకులను ప్రకటించింది. బ్యాటింగ్లో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 30 ర్యాంక్లు ఎగబాకి 11వ స్థానానికి చేరుకున్నాడు. ముంబై వేదికగా జరిగిన కివీస్ రెండో టెస్టులో మయాంక్ 150, 62 పరుగులతో అదరగొట్టాడు. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ 21 స్థానాలు మెరుగుపర్చుకుని 45కు చేరుకోగా.. భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఐదు, ఆరో ర్యాంక్ల్లో స్థిరంగా కొనసాగుతున్నారు. ఆల్ రౌండర్ ర్యాంకుల్లో హోల్డర్ తొలి స్థానంలో ఉండగా.. రవీంద్ర జడేజాను వెనక్కునెట్టి రెండో ర్యాంక్కు అశ్విన్ చేరగా.. జడేజా నాలుగో మెట్టుకు దిగజారాడు. బౌలింగ్లో తొలిస్థానంలో పాట్ కమిన్స్ కొనసాగుతుండగా.. మన హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ నాలుగు స్థానాలు మెరుగై 41వ ర్యాంక్కు చేరాడు. పదికి పది వికెట్లు తీసిన న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ యూనస్ పటేల్ 24 స్థానాలు మెరుగు చేసుకుని 38వ స్థానంలో నిలిచాడు.