న్యూఢిల్లీ: భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin).. ఐసీసీ టెస్ట్ బౌలర్స్ ర్యాంకింగ్స్లో మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇప్పటిదాకా అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ను రెండో స్థానానికి నెట్టేశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో ఆరు వికెట్లు పడగొట్టడం ద్వారా అశ్విన్ ఈ ఘనత దక్కించుకున్నాడు.
కాగా, 36 ఏండ్ల అశ్విన్ 2015లో తొలిసారి ఐసీసీ టెస్ట్ బౌలర్స్ ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్కు వెళ్లాడు. అప్పటి నుంచి పలు సందర్భాల్లో అశ్విన్ అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్ సందర్భంగా టాప్ బ్యాటర్లు మార్నస్ లబుషగ్నే, స్టీవ్ స్మిత్లను ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. ఆ
తర్వాత మరో బ్యాటర్ అలెక్స్ క్యారీ వికెట్ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో కూడా పిచ్ స్పిన్కు అనుకూలించడంతో అశ్విన్, రవీంద్ర జడేజా రెచ్చిపోయారు. అశ్విన్.. ఆస్ట్రేలియా టాప్-5 బ్యాటర్లలో ముగ్గురిని ఔట్ చేయగా, జడేజా మిగతా ఏడు వికెట్లను తీసి ఔరా అనిపించాడు. ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ బౌలర్స్ ర్యాంకింగ్స్లో అశ్విన్ 864 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 859 పాయింట్లతో జేమ్స్ అండర్సన్ ఆ తర్వాత స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్రౌండర్ జడేజా 8వ స్థానంలో ఉన్నాడు.