దుబాయ్: ఐపీఎల్ 2021( IPL 2021 )లో ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ ఫామ్లో ఉంది. ఆడిన 8 మ్యాచ్లలో ఆరు గెలిచి పాయింట్ల టేబుల్లో రెండోస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆ టీమ్ సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్తో తలపడబోతోంది. ఈ సీజన్లో మరీ చెత్తగా ఆడుతున్న సన్రైజర్స్ టీమ్ పాయింట్ల టేబుల్లో చివరి స్థానంలో ఉంది. పైగా జానీ బెయిర్స్టోలాంటి కీ బ్యాట్స్మన్ సేవలు కూడా కోల్పోయింది. అయినా ఈ మ్యాచ్కు ముందు ఓ ప్లేయర్ను చూసి ఢిల్లీ క్యాపిటల్స్ భయపడుతోంది. ఆ ప్లేయర్ ఎవరో కాదు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్.
ఢిల్లీపై అదిరిపోయే రికార్డు
తన లెగ్స్పిన్తో ఐపీఎల్లో అన్ని టీమ్స్కూ రషీద్ చుక్కలు చూపించాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్పై మాత్రం అతడు మరింత చెలరేగాడు. ఆ టీమ్పై ఇప్పటి వరకూ 11 మ్యాచ్లు ఆడిన రషీద్ 14 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ఉన్న టీమ్స్పై ఇదే అత్యుత్తమ రికార్డు. అంతేకాదు ఢిల్లీపై రషీద్ ఎకానమీ 5.63 మాత్రమే. ఢిల్లీ క్యాపిటల్స్పై ఓ బౌలర్ నమోదు చేసిన అత్యుత్తమ ఎకానమీ కూడా ఇదే కావడం విశేషం. దీంతో రిషబ్ పంత్ టీమ్ రషీద్ను చూసి ఆందోళనకు గురవుతోంది.
ఇక మ్యాచ్ జరిగే దుబాయ్లోనూ రషీద్కు బెస్ట్ ఎకానమీ రేటు ఉంది. కనీసం 20 ఓవర్లకుపైగా వేసిన బౌలర్లలో రషీద్దే అత్యుత్తమ ఎకానమీ రేటు. కచ్చితమైన లైన్ అండ్ లెంత్తో బ్యాట్స్మెన్ను కట్టడి చేయడం రషీద్ అలవాటు. ముఖ్యంగా అటాక్ చేయడానికి ప్రయత్నించే బ్యాట్స్మెన్ రషీద్కు ఈజీగా దొరికిపోతారు. ఐపీఎల్ 2021 తొలి లెగ్లో పెద్దగా రాణించలేకపోయిన సన్రైజర్స్.. ఈ రెండో లెగ్లో శుభారంభం చేయడానికి రషీద్ వైపే చూస్తోంది.