హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా హైదరాబాద్, ఢిల్లీ జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగుతున్నది. ఇప్పటికే ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఐదింట ఓడిన హైదరాబాద్ ఆఖరి మ్యాచ్లోనైనా పరువు కాపాడుకోవాలని చూస్తున్నది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ తొలి రోజు ఆట ముగిసే సరికి నాలుగు వికెట్లు నష్టపోయి 247 పరుగులు చేసింది. రోహిత్రాయుడు(90 నాటౌట్), చందన్ సహానీ(67) అర్ధసెంచరీలతో రాణించారు. ఇన్ఫామ్ బ్యాటర్, కెప్టెన్ తన్మయ్ అగర్వాల్(23) నిరాశపరిచినా..రోహిత్, సహానీ సమయోచిత ఇన్నింగ్స్లతో ఆకట్టుకున్నారు. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్కు 132 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దివిజ్ మెహ్రా(2/38) రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ ద్వారా శశాంక్ లోకేశ్, ప్రణీత్ రాజ్ హైదరాబాద్ తరఫున రంజీల్లో అరంగేట్రం చేశారు.