బెంగళూరు: అరంగేట్ర ఆటగాడు సువేద్ పార్కర్ (447 బంతుల్లో 252; 21 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ డబుల్ సెంచరీతో చెలరేగడంతో ఉత్తరాఖండ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ముంబై పటిష్ట స్థితిలో నిలిచింది. ఆడుతున్న తొలి రంజీ మ్యాచ్లోనే సువేద్ సత్తాచాటగా.. ఈ సీజన్లో దంచికొడుతున్న సర్ఫరాజ్ ఖాన్ (153; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) మరో సెంచరీతో ఆకట్టుకున్నాడు. షంస్ ములానీ (59; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆఖర్లో వేగంగా ఆడాడు. ఉత్తరాఖండ్ బౌలర్లలో దీపక్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం మంగళవారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఉత్తరాఖండ్.. ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. చేతిలో 8 వికెట్లు ఉన్న ఉత్తరాఖండ్.. ముంబై స్కోరుకు ఇంకా 608 పరుగులు వెనుకబడి ఉంది.
బెంగాల్ 577/5
జార్ఖండ్తో జరుగుతున్న మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్ 577/5తో నిలిచింది. సుదీప్ కుమార్ (186), అనుస్తుప్ మజుందార్ (117) శతకాలతో కదం తొక్కారు. పంజాబ్తో జరుగుతున్న మరో పోరులో మధ్యప్రదేశ్ దీటుగా బదులిస్తున్నది. పంజాబ్ తొలి ఇన్నింగ్స్లో 219 పరుగులకు ఆలౌట్ కాగా.. మధ్యప్రదేశ్ 2 వికెట్లు కోల్పోయి 238 రన్స్ చేసింది. శుభం శర్మ (102 బ్యాటింగ్) అజేయ శతకంతో రాణించాడు. యూపీతో పోరులో తొలిఇన్నింగ్స్లో 253 పరుగులకు ఆలౌటైన కర్ణాటక.. అనంతరం ప్రత్యర్థిని 155కు కట్టడి చేసింది. రెండో ఇన్నింగ్స్లో 100 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన కర్ణాటక ఓవరాల్గా 198 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది.
2 ముంబై తరఫున రంజీ అరంగేట్ర మ్యాచ్లో డబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా సువేద్ నిలిచాడు. ప్రస్తుత ముంబై కోచ్ అమోల్ మజుందార్ తొలి మ్యాచ్లోనే 260 పరుగులు బాది మొదటి స్థానంలో ఉన్నాడు.