హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ తొలి పోరులో హైదరాబాద్ బ్యాటర్లు అదరగొట్టారు. రాహుల్ సింగ్ (157 బంతుల్లో 214; 23 ఫోర్లు, 9 సిక్సర్లు) డబుల్ సెంచరీతో కదంతొక్కగా.. కెప్టెన్ తిలక్ వర్మ (100 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ చేశాడు. తన్మయ్ అగర్వాల్ (80) రాణించాడు. ఫలితంగా ప్లేట్ గ్రూప్లో భాగంగా నాగాలాండ్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో హైదరాబాద్ 474/5 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన నాగాలాండ్ 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. చేతిలో 9 వికెట్లు ఉన్న నాగాలాండ్.. హైదరాబాద్ స్కోరుకు 439 పరుగుల దూరంలో ఉంది.