ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న ప్రతిష్ఠాత్మక దేశవాళీ ట్రోఫీని మధ్యప్రదేశ్ ఎట్టకేలకు ముద్దాడింది. టాపార్డర్ మెరుపులకు బౌలర్ల క్రమశిక్షణ తోడవడంతో రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ నయా చాంపియన్గా అవతరించింది. రెండు దశాబ్దాల క్రితం ఇదే వేదికపై జరిగిన ఫైనల్లో తడబడి రన్నరప్గా నిలిచిన మధ్యప్రదేశ్.. ఈ సారి రంజీ రారాజు ముంబైపై జయభేరి మోగించి సగర్వంగా కప్పు చేజిక్కించుకుంది. అప్పుడు కెప్టెన్గాఉన్న చంద్రకాంత్ పండిట్ ఈసారి కోచ్గా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం కొసమెరుపు!
బెంగళూరు: సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన మధ్యప్రదేశ్ (ఎంపీ) రంజీ ట్రోఫీలో నయా చాంపియన్గా అవతరించింది. ఆదివారం ముగిసిన ఏకపక్ష ఫైనల్లో ఎంపీ 6 వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 374 పరుగులకు ఆలౌట్ కాగా.. మధ్యప్రదేశ్ 536 రన్స్ చేసి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో ముంబై 269 పరుగులకు పరిమితమైంది. సువెద్ పార్కర్ (51), సర్ఫరాజ్ ఖాన్ (45), కెప్టెన్ పృథ్వీ షా (44) ఫర్వాలేదనిపించారు. ఎంపీ బౌలర్లలో కుమార్ కార్తికేయ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 108 పరుగుల లక్ష్యాన్ని ఎంపీ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుభమ్ శర్మ (30), రజత్ పాటిదార్ (30 నాటౌట్), హిమాన్షు (37) రాణించారు. తొలి ఇన్నింగ్స్లో సూపర్ సెంచరీతో చెలరేగిన శుభమ్ శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, సీజన్లో 982 పరుగులు నమోదు చేసిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
అప్పుడలా.. ఇప్పుడిలా..
1998-99 సీజన్ రంజీ ఫైనల్లో మధ్యప్రదేశ్ జట్టు పరాజయం పాలైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోనే జరిగిన ఆ పోరులో మధ్యప్రదేశ్ జట్టుకు చంద్రకాంత్ పండిట్ కెప్టెన్గా వ్యవహరించాడు. 23 ఏండ్ల తర్వాత ఇక్కడే జరిగిన ఫైనల్లో చంద్రకాంత్ కోచింగ్లోనే మధ్యప్రదేశ్ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీని ముద్దాడటం గమనార్హం. అనామక ఆటగాళ్లతో అద్భుత ప్రదర్శనలు రాబట్టడం అలవాటుగా మార్చుకున్న చంద్రకాంత్కు ఇది ఆరో జాతీయ టైటిల్ కావడం విశేషం.
అనుకోని విజేత..
అండర్డాగ్గా సీజన్ ప్రారంభించిన మధ్యప్రదేశ్.. నిలకడైన ఆటతీరుతో అంచెలంచెలుగా ఎదిగి మొదటిసారి రంజీ ట్రోఫీని ముద్దాడింది. వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్ వంటి స్టార్ ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా.. పరిమిత వనరులతోనే మధ్యప్రదేశ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. రజత్ పాటిదార్ ఒక్కడే కాస్త పేరున్న ఆటగాడు కాగా.. కెప్టెన్ ఆదిత్య శ్రీవాస్తవ, శుభమ్ శర్మ, హిమాన్షు, యశ్ దూబే చక్కటి ప్రదర్శన కొనసాగించడంతో గ్రూప్-ఎలో భాగంగా లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్ల్లో మధ్యప్రదేశ్ రెండు విజయాలు, ఒక ‘డ్రా’ నమోదు చేసుకుంది. క్వార్టర్స్లో పంజాబ్పై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన ఎంపీ.. 10 వికెట్లతో విజయం సాదించి సెమీస్కు చేరింది.
రసవత్తరంగా సాగిన సెమీఫైనల్లో బెంగాల్పై 174 పరుగుల తేడాతో గెలుపొందిన మధ్యప్రదేశ్.. 41 సార్లు రంజీ టైటిల్ కైవసం చేసుకున్న ముంబైతో ఫైనల్కు అర్హత సాధించింది. తుదిపోరులో టాస్ ఓడటంతోనే ఒకింత వెనుకబడ్డట్లు కనిపించిన మధ్యప్రదేశ్ క్రమశిక్షణాయుత ఆటతో అదరగొట్టింది. మొదటి ఇన్నింగ్స్లో ప్రత్యర్థి మంచి స్కోరు చేసినా.. తమ అవకాశం రాగానే ఆకలిగొన్న పులుల్లా విజృంభించారు. ఆనక బౌలర్లు సత్తాచాటడంతో రెండో ఇన్నింగ్స్లో ముంబై తక్కువ స్కోరుకే పరిమితమైంది. పృథ్వీ షా, యశస్వి, అర్మాన్ జాఫర్, సర్ఫరాజ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్న ముంబైని కట్టడి చేయడంలో ఎంపీ బౌలర్ కుమార్ కార్తీకేయ కీలక పాత్ర పోషించాడు. కప్పు చేజిక్కించుకున్నాక 23 ఏండ్ల కిందటి జ్ఞాపకాలతో కోచ్ చంద్రకాంత్ ఆనందభాష్పాలు రాలిస్తే.. తొలిసారి ట్రోఫీ అందుకున్న మధ్యప్రదేశ్ టీమ్కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ అభినందనలు తెలిపారు.
ఏ ట్రోఫీ నెగ్గిన సంతృప్తి కలుగడం సహజమే. అయితే ఈ కప్పు నాకు చాలా ప్రత్యేకం. సారథిగా 23 ఏండ్ల క్రితం సాధించలేకపోయింది.. కోచ్గా చేజిక్కించుకోవడం డబుల్ ఆనందంగా ఉంది. అందుకే కాస్త భావోద్వేగానికి గురయ్యా. రంజీ సన్నాహకాల్లో ఉన్నప్పుడే కెప్టెన్ ఆదిత్య నా వద్దకు వచ్చి.. పెళ్లికి సెలవు కావాలని అడిగాడు. అందుకు నేను రెండు రోజుల సమయం మాత్రమే ఇవ్వగలను అని అన్నా.. అయినా ఆట కోసం అతడు దానికి అంగీకరించాడు. ఇలా ప్రతీ ఒక్కరూ తమ వంతు కృషి చేయడంతోనే ఈ రోజు మధ్యప్రదేశ్ విజేతగా నిలువగలిగింది. చాంపియన్గా అవతరించాలంటే ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుందని.. గంటల తరబడి ప్రాక్టీస్కే పరిమితమవ్వాలని ఆటగాళ్లకు ముందు నుంచే చెప్పా. దాన్ని మైదానంలో తూచా తప్పకుండా ఆచరించడంతోనే ఇది సాధ్యపడింది.
-చంద్రకాంత్ పండిట్, మధ్యప్రదేశ్ కోచ్