భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ రమేశ్ పవార్ మళ్లీ ఎంపికయ్యాడు. విమెన్స్ క్రికెట్ టీమ్ ప్రధాన కోచ్గా పవార్ను నియమిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గురువారం ప్రకటించింది. కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తు ఆహ్వానించగా 35 మందికి పైగా పోటీపడ్డారు.
సులక్షణ నాయక్, మదన్ లాల్, రుద్ర ప్రతాప్ సింగ్లతో కూడిన ముగ్గురు సభ్యుల క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) దరఖాస్తు చేసుకున్న వారిని ఇంటర్వ్యూ చేసింది. ఈ కమిటీ పవార్ను మళ్లీ కోచ్గా ఏకగ్రీవంగా ఎంపికచేసిందని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
పవార్ సారథ్యంలోని భారత మహిళల జట్టు 2018 ఐసీసీ టీ20 మహిళల ప్రపంచకప్లో సెమీఫైనల్కు అర్హత సాధించింది. వరుసగా 14 టీ20 మ్యాచ్లను కూడా గెలుచుకుంది. మాజీ క్రికెటర్ రమేశ్ భారత్ తరఫున 2 టెస్టులు, 31 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. ఫస్ట్క్లాస్ కెరీర్లో 148 మ్యాచ్ల్లో 470 వికెట్లు పడగొట్టడం విశేషం.