BCCI : ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అర్దాంతరంగా రద్దయ్యింది. ఫ్లడ్ లైట్స్ వెలగకపోవడంతో భద్రతా కారణాల రీత్యా ఇరుజట్ల ఆటగాళ్లను వెంటనే అధికారులు టీమ్ హోటల్కు తరలించారు. భారత్ – పాకిస్థాన్ సరిహద్దుల్లో డ్రోన్ల దాడు(Drone Attacks)లు జరుగుతున్నందున ఆటగాళ్లను సురక్షితంగా అక్కడి నుంచి తీసుకొచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైంది. అందుకోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తున్నామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా(Rajeev Shukla) వెల్లడించాడు.
‘ధర్మశాలలో చిక్కుకున్న ఢిల్లీ, పంజాబ్ క్రికెటర్లు, సహాయక సిబ్బందిని సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత మాది. అందుకోసం ఉనా(Una) నుంచి ప్రత్యేకంగా ఒక రైలు ఏర్పాడు చేస్తున్నాం. ప్రస్తుతం మ్యాచ్ రద్దు కావడంతో అందరూ స్టేడియం ఖాళీ చేస్తున్నారు. రేపు పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేశాక ఐపీఎల్ 18వ సీజన్ను కొనసాగించాలా? వద్దా? అనే విషయమై నిర్ణయం తీసుకుంటాం. అయితే.. ఇప్పటికైతే ఆటగాళ్ల భద్రతే మాకు ప్రధానం. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఈరోజు మ్యాచ్ నిర్వహించడం సురక్షితం కాదని మేము భావించాం’ అని శుక్లా తెలిపాడు.
#WATCH | Dharamshala: Sudhir, a cricket fan says, “The match has been called off because of security reasons. What do we have to be afraid of? We are in our country. If anyone, it should be Pakistan who should be afraid. Bharat Mata ki Jai.” https://t.co/N3YDWolW07 pic.twitter.com/QjiNCQn9sZ
— ANI (@ANI) May 8, 2025
‘ఆపరేషన్ సిందూర్’ తదనంతర పరిణామాలను దృష్టిలో ఉంచుకొని హిమాచల్ ప్రదేశ్లోని విమానాశ్రయాన్ని మూసి వేసిన విషయం తెలిసిందే. అప్పటికే పంజాబ్, ఢిల్లీ క్రికెటర్లు ధర్మశాల చేరుకోవడంతో కట్టుదిట్టమైన భద్రత నడమ గురువారం మ్యాచ్ నిర్వహించారు. వర్షం కారణంగా టాస్ ఆలస్యం కాగా.. 8:30 గంటలకు మ్యాచ్ మొదలైంది. అయితే.. పంజాబ్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ ఒక బంతి పడగానే ఒక ఫ్లడ్ లైట్ ఆగిపోయింది. ఆ వెంటనే మరో రెండు పని చేయలేదు. బ్లాక్ అవుట్ కారణంగా అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు.