బెంగళూరు: న్యూజిలాండ్ ‘ఎ’ జట్టుతో జరుగుతున్న అనధికారిక మూడో టెస్టుపై భారత్ ‘ఎ’ పట్టు బిగిస్తున్నది. సొంతగడ్డపై పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటూ ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నది. భారత్ ‘ఎ’ నిర్దేశించిన 416 పరుగుల లక్ష్యఛేదనలో కివీస్ ‘ఎ’ వికెట్ నష్టపోయి 20 పరుగులు చేసింది. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్న కివీస్ విజయానికి 396 పరుగుల దూరంలో ఉంది.
జో కార్టర్(6), జో వాల్కర్(0) క్రీజులో ఉండగా, సౌరభ్ కుమార్(1/13)కు ఏకైక వికెట్ దక్కింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 40/1తో మూడో రోజు శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన యువ భారత్ 359/7 స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పాటిదార్(109 నాటౌట్) అజేయ సెంచరీతో కదంతొక్కగా, ఆరు పరుగుల తేడాతో రుతురాజ్ గైక్వాడ్(94) శతకం చేజార్చుకున్నాడు. కెప్టెన్ ప్రియాంక్ పంచల్(62), సర్ఫరాజ్ఖాన్(63) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు.
ముఖ్యంగా పాటిదార్ ఈ సీజన్లో తన అత్యుత్తమ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. గత మూడు నెలల కాలంలో పాటిదార్కు ఇది మూడో సెంచరీ. మరోవైపు రుతురాజ్ చక్కటి పరిణతి కనబరిచాడు. ప్రియాంక్తో కలిసి రెండో వికెట్కు 122 పరుగులు జోడించిన రుతురాజ్..మూడో వికెట్కు పాటిదార్తో కలిసి 102 పరుగులు జోడించాడు. రచిన్ రవీంద్ర(3/65),జో వాల్కర్(2/64) రాణించారు.