ఐపీఎల్ కొత్త సీజన్ను మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ విజయంతో ఆరంభించింది. బ్యాటింగ్లో కెప్టెన్ సంజూ శాంసన్,దేశవాళీలో నిలకడగా ఆడుతున్న అస్సాం కుర్రాడు రియాన్ పరాగ్లు రెచ్చిపోయి ఆడగా బౌలింగ్లో ట్రెంట్ బౌల్ట్తో పాటు ఇతర బౌలర్లూ సమిష్టిగా రాణించడంతో ఆ జట్టు లక్నోపై జయకేతనం ఎగురవేసింది.భారీ ఛేదనలో భాగంగా ఆదిలోనే తడబడ్డ లక్నో సూపర్ జెయింట్స్కు..కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్లు పోరాడినా పరాభవం తప్పలేదు.
Rajasthan Royals | జైపూర్ : ఐపీఎల్ – 17వ సీజన్ను రాజస్థాన్ రాయల్స్ రాజసంగా మొదలెట్టింది. జైపూర్లోని సవాయి మాన్సింగ్ స్టేడియం వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ను 20 పరుగుల తేడాతో ఓడించి గెలుపు బోణీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేయగా లక్ష్య ఛేదనలో లక్నో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగుల వద్దే ఆగిపోయింది. ఐపీఎల్ – 2020వ సీజన్ నుంచీ ఆడుతున్న ప్రతి తొలి మ్యాచ్లో ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేస్తున్న రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ (52 బంతుల్లో 82 నాటౌట్, 3 ఫోర్లు, 6 సిక్సర్లు) లక్నోతోనూ ఆ సంప్రదాయాన్ని కొనసాగించాడు. రియాన్ పరాగ్ (29 బంతుల్లో 43, 1 ఫోర్, 3 సిక్సర్లు) అండతో రాజస్థాన్ భారీ స్కోరు సాధించేందుకు బాటలు పరిచాడు. భారీ ఛేదనలో లక్నోకు ట్రెంట్ బౌల్ట్ (2/35), సఫారీ సంచలనం నండ్రె బర్గర్ (1/30) ఆరంభంలోనే షాకులిచ్చినా రాహుల్ (44 బంతుల్లో 58, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), నికోలస్ పూరన్ (41 బంతుల్లో 64 నాటౌట్, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆదుకున్నా ఆఖర్లో వేగంగా పరుగులు రాబట్టలేక ఆ జట్టు ఓటమి వైపున నిలిచింది.రాజస్థాన్ సారథి శాంసన్కే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
దంచిన శాంసన్, పరాగ్:
రాజస్తాన్ ఇన్నింగ్స్లో శాంసన్-పరాగ్ ఆటే హైలైట్. నవీన్ ఉల్ హక్ వేసిన రెండో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన బట్లర్ (11) అదే ఓవర్లో ఆఖరి బంతికి కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో రాజస్థాన్కు తొలి షాక్ తాకింది. వన్ డౌన్లో క్రీజులోకి వచ్చిన శాంసన్.. ఆది నుంచే దూకుడుగా ఆడాడు. మోహ్సిన్ ఖాన్ వేసిన ఐదో ఓవర్లో4,6 తో తన ఉద్దేశాన్ని చాటాడు. కానీ ఇదే ఓవర్లో ఐదో బాల్ను భారీ సిక్సర్గా మలిచిన జైస్వాల్ (24) మరుసటి బంతికే మిడాన్ వద్ద కృనాల్ పాండ్యాకు చిక్కడంతో రాజస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు వచ్చిన పరాగ్తో కలిసి శాంసన్ రాజస్థాన్ స్కోరుబోర్డును ఉరకలెత్తించాడు. ఈ ద్వయం లక్నో బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడింది. మూడో వికెట్కు 59 బంతుల్లోనే 93 పరుగులు జోడించిన ఈ జోడీకి ఎట్టకేలకు నవీన్ ఉల్ హక్ చెక్ పెట్టాడు. నాలుగో స్థానంలో వచ్చిన షిమ్రన్ హెట్మయర్ (5)ను బిష్ణోయ్ పెవిలియన్కు పంపినా ధ్రువ్ జురెల్ (20*).. కెప్టెన్తో కలిసి రాజస్తాన్కు భారీ స్కోరు చేయడంలో తోడ్పాటు అందించాడు.
ఆరంభం నుంచే తడబాటు:
లక్ష్య ఛేదనలో లక్నోకు తొలి ఓవర్ నుంచే కష్టాలు మొదలయ్యాయి. ట్రెంట్ బౌల్ట్.. మొదటి ఓవర్లోనే క్వింటన డికాక్ (4)ను ఔట్ చేశాడు. రెండో ఓవర్లో దేవ్దత్ పడిక్కల్ బౌల్డ్ అయ్యాడు. బర్గర్.. నాలుగో ఓవర్లో అయూష్ బదోనిని పెవిలియన్కు పంపాడు. 11 పరుగులకే లక్నో మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆరంభంలోనే తడబాటుకు లోనైన లక్నోను రాహుల్ ఆదుకున్నాడు. దీపక్ హుడా (26)తో కలిసి లక్నో ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఈ ఇద్దరూ 26 బంతుల్లోనే 49 పరగులు జతచేశారు. కుదురుకుంటున్న లక్నో ఇన్నింగ్స్ను చాహల్ దెబ్బకొట్టాడు. పూరన్తో కలిసి రాహుల్ లక్నోలో గెలుపు ఆశలు రేపాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్కు 85 పరుగులు జోడించారు. కానీ ఆఖర్లో రాహుల్, మార్కస్ స్టోయినిస్ (3) వికెట్లను కోల్పోవడంతో పాటు రాజస్థాన్ బౌలర్లు కట్టడి చేయడంతో లక్నోకు పరాభవం తప్పలేదు.
సంక్షిప్త స్కోర్లు
రాజస్థాన్: 20 ఓవర్లలో 193/4 (శాంసన్ 82 నాటౌట్, పరాగ్ 43, జైస్వాల్ 24, నవీన్ 2/41) లక్నో: 20 ఓవర్లలో 173/6 (పూరన్ 64, రాహుల్ 58, ట్రెంట్ బౌల్ట్ 2/35, సందీప్ శర్మ 1/22)