న్యూఢిల్లీ: ఆసియా క్రికెట్ కప్లో భారత్ మ్యాచ్లను వరుణుడు వదిలేలా లేడు. ఇప్పటికే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ను ఆస్వాదిద్దామని ఎదురుచూసిన అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. పల్లెకెలె వేదికగా దాయాదుల మధ్య మ్యాచ్ జరుగుతుండగా భారత్ ఇన్నింగ్స్ ముగిసేలోపు రెండు సార్లు వర్షం అంతరాయం కలిగించింది. చివరికి 48.5 ఓవర్లలో 266 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది.
ఆ తర్వాత వరుణుడు మరోసారి ఆటంకం కలిగించడంతో పాక్ ఇన్నింగ్స్ ప్రారంభమవ్వకుండానే మ్యాచ్ రద్దయ్యింది. రేపు (సెప్టెంబరు 4న) భారత్-నేపాల్ మధ్య అదే పల్లెకెలె వేదికగా మ్యాచ్ జరుగనుంది. సెప్టెంబర్ 4న పల్లెకెలె ప్రాంతంలో 80 శాతం వర్షంపడే అవకాశాలున్నాయని అక్కడి వాతావరణ కేంద్రం ప్రకటించింది. దాంతో భారత్-పాక్ మ్యాచ్ లాగే ఈ మ్యాచ్ కూడా రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఈ మ్యాచ్ కూడా రద్దయితే భారత్ పరిస్థితి..?
వర్షం కారణంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు కావడంతో ఇరుజట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. దాంతో గ్రూప్ ‘ఎ’లో పాకిస్థాన్ ఒక విజయం (నేపాల్పై), ఒక రద్దుతో మూడు పాయింట్లు ఖాతాలో వేసుకుని సూపర్-4కు దూసుకెళ్లింది. రేపు నేపాల్తో మ్యాచ్ జరిగితే భారత్ విజయం లాంఛనమే కాబట్టి భారత్ కూడా 3 పాయింట్లతో సూపర్-4లో అడుగుపెడుతుంది. ఒకవేళ వర్షంవల్ల భారత్, నేపాల్ మ్యాచ్ రద్దయితే భారత్ కేవలం రెండు పాయింట్లతో సూపర్-4కు అర్హత సాధిస్తుంది. సూపర్-4లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఈ నెల 10న మరోసారి తలపడనున్నాయి.