ఊహించిందే జరిగింది! మ్యాచ్కు వర్షం ముప్పు ఉందని అనుకున్నట్లే.. వరుణుడు ఆర్ధాంతరంగా ఆటను ఆపేశాడు. పాక్ పేసర్ల తొలి స్పెల్ను భారత బ్యాటర్లు కాచుకోవడం కష్టం అని భావించినట్లే.. షాహీన్, రవుఫ్ బౌలింగ్లో టాప్-4 వికెట్లు సమర్పించుకున్నారు. ఆది, అంతాలు పాక్ పేసర్లు విజృంభిస్తే.. మధ్యలో మన మిడిలార్డర్ దుమ్మురేపింది. ఒత్తిడి కొండలా పెరిగిపోతున్న సమయంలో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా చూపిన తెగువను ఎంత మెచ్చుకున్నా తక్కువే!
పల్లెకెలె: సుదీర్ఘ కాలం తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ను వరుణుడు అడ్డుకున్నాడు. టీమ్ఇండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో దోబూచులాడిన వర్షం.. పాక్ బ్యాటర్లను అసలు మైదానంలోకే రానివ్వకుండా ముంచెత్తింది. దీంతో చిరకాల ప్రత్యర్థుల మధ్య 2019 ప్రపంచకప్ తర్వాత జరిగిన వన్డే వర్షార్పణమైంది. ఆసియాకప్లో భాగంగా శనివారం పల్లెకెలెలో జరిగిన దాయాదుల పోరు ఫలితం తేలకుండానే ముగిసింది. మ్యాచ్ జరిగినంత సేపు ఇరు జట్ల మధ్య ఆధిక్యం చేతులు మారగా.. టీమ్ఇండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ ఆరంభం చూసినవాళ్లు రోహిత్ సేన ఇంత స్కోరు చేస్తుందని కూడా ఊహించి ఉండరు. క్లిష్ట సమయంలో ఇషాన్ కిషన్ (81 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (90 బంతుల్లో 87; 7 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్సెంచరీలతో కదం తొక్కారు. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (4), శ్రేయస్ అయ్యర్ (14), శుభ్మన్ గిల్ (10), రవీంద్ర జడేజా (14) విఫలమయ్యారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది 4, నసీమ్ షా, హరీస్ రవుఫ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. టోర్నీలో భాగంగా భారత్ తమ తదుపరి మ్యాచ్లో సోమవారం నేపాల్తో తలపడనుంది.
మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉన్న తరుణంలో టాస్ గెలిచిన రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వరుణుడి కారణంగా అప్పటికే ఓ సారి మ్యాచ్కు అంతరాయం వాటిల్లగా.. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో షాహీన్ ఓ అద్భుత బంతితో రోహిత్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అతడి తదుపరి ఓవర్లో కోహ్లీ బంతిని వికెట్ల మీదకు ఆడుకొని పెవిలియన్ బాటపట్టాడు. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ను రవుఫ్ వెనక్కి పంపగా.. మొండిగా పోరాడేందుకు ప్రయత్నించిన గిల్ కూడా వెనుదిరిగాడు. దీంతో భారత్ 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. ఇషాన్, పాండ్యా జట్టును ఆదుకున్నారు. పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే.. స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగిన ఈ జంట ఇన్నింగ్స్ను నిలబెట్టింది. బ్యాటింగ్కు కష్టతరంగా మారిన పిచ్పై ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ ఇద్దరూ క్రీజులో కుదురుకున్నాక స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇక భారత్కు తిరుగులేదు అనుకుంటున్న సమయంలో మరోసారి పేసర్లు దెబ్బకొట్టారు.సెంచరీలు చేసేలా కనిపించిన ఇసాన్, పాండ్యా వెనుదిరగడంతో భారత్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.
నాణ్యమైన పేసర్లను ఎదుర్కోవడంలో మన టాపార్డర్ మరోసారి విఫలమైంది. ముఖ్యంగా ఎడమచేతి పేసర్ బంతులను ఎలా ఆడాలో తెలియనట్లు తేలికగా వికెట్ సమర్పించుకోవడం చాన్నాళ్లుగా టీమ్ మేనేజ్మెంట్ను కలవర పెడుతున్నది. మహమ్మద్ అమీర్, ట్రెంట్ బోల్ట్, షాహీన్ షా అఫ్రిది ఇలా లెఫ్టార్మ్ పేసర్లను ఆడటంలో మనవాళ్లు తడబడుతున్నారు. 2021 టీ20 ప్రపంచకప్లో షాహీన్ దెబ్బకే భారత్ తొలిసారి ప్రపంచకప్లో పాక్ చేతిలో పరాజయం చవిచూడగా.. తాజా మ్యాచ్లోనూ అలాంటి పరిస్థితే కనిపించింది. ఇందులో అతడి నైపుణ్యం కొంతైతే.. మనవాళ్లు నిర్లిప్తతే కొండంత! రోహిత్ ఔటైన బంతి విషయంలో అఫ్రిదిని మెచ్చుకోక తప్పకపోయినా.. కోహ్లీ మాత్రం అనవసరంగా వికెట్ సమర్పించుకున్నాడు. హాఫ్వాలీ బంతిని డిఫెన్స్ ఆడే ప్రయత్నంలో వికెట్ల మీదకు ఆడుకోవడం ఏమాత్రం ఆక్షేపణీయం కాదు. ప్రపంచంలో ఎలాంటి బౌలర్నైనా అలవోకగా ఆడగలిగే సత్తా ఉన్న విరాట్.. ఇలా సిల్లీగా ఔట్ కావడం అభిమానులకు సైతం రుచించలేదు! పాక్ పేసర్ల తొలి స్పెల్ను సమర్థవంతంగా ఎదుర్కొంటే.. ఆ తర్వాత పరుగులు రాబట్టడం పెద్ద కష్టం కాదని మాజీలంతా సూచిస్తున్నా.. మనవాళ్లు మాత్రం ఆరంభంలోనే ప్రత్యర్థికి ఆధిక్యం మూటగట్టేశారు. మిడిలార్డర్లో ఇషాన్, పాండ్యా సంయమనంతో ఆడటం వల్ల పరువు దక్కింది కానీ.. లేకుంటే టాపార్డర్పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యేవే! మరో నెల రోజుల్లో ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టాపార్డర్ లోపాలు సరిదిద్దుకోకుంటే కష్టమే.
– నమస్తే తెలంగాణ క్రీడా విభాగం
భారత్: 48.5 ఓవర్లలో 266 (పాండ్యా 87, ఇషాన్ 82; షాహీన్ 4/35, నసీమ్ 3/36).