శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్లో పలువురు సీనియర్ ప్లేయర్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. వారిలో వికెట్ కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా కూడా ఒకడు. అతని స్థానంలో యువ ప్లేయర్ కేఎస్ భరత్కు బీసీసీఐ అవకాశం కల్పించింది. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే విషయంలో ఆలోచించుకోవాలని టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ తనకు చెప్పినట్లు సాహా వెల్లడించాడు.
సాహా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ అభిమానులకు పెద్ద షాకే ఇచ్చాయి. నిన్నమొన్నటి వరకు భారత క్రికెట్లో కెప్టెన్సీ వివాదం జరిగింది. అది సద్దుమణిగింది అనుకునేంతలో ఒక సీనియర్ ప్లేయర్ ఇలా కామెంట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సాహా వ్యాఖ్యలపై ద్రావిడ్ స్పందించాడు. ఆదివారం విండీస్తో జరిగిన మూడో టీ20 విజయం తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ద్రావిడ్ మాట్లాడాడు.
సాహా వ్యాఖ్యలపై విలేకర్లు ప్రశ్నించగా.. ‘టీ20 సిరీస్ విజయంపై శుభాకాంక్షలు చెప్పినందుకు థ్యాంక్స్’ అంటూ నవ్వాడు. అనంతరం సాహా వ్యాఖ్యలపై మాట్టాడుతూ.. ‘ఆ వ్యాఖ్యలు నన్నేమీ బాధించలేదు. సాహా అందించిన విజయాలు, జట్టుకు చేసిన సేవను నేను గౌరవిస్తా. అందుకే నేను అతనితో మాట్లాడా. అతని విషయంలో నిజాయితీ, స్పష్టత అవసరం అనిపించింది’ అని తేల్చిచెప్పాడు. లంక సిరీస్లో అతన్ని పక్కనపెట్టడం గురించి మీడియా ద్వారా సాహాకు తెలియడం తనకు ఇష్టం లేదని, అందుకే ముందుగానే ఈ విషయంపై మాట్లాడానని అన్నాడు.
జట్టులో స్థానం దక్కని ఆటగాళ్లందరితో తాను ఇలాగే మాట్లాడతానని వెల్లడించాడు. కొన్నిసార్లు కొంతమంది ఆటగాళ్లు ఈ సంభాషణలు కష్టంగా ఉంటాయని, అందుకని అసలు మాట్లాడకపోవడం సరికాదు కదా అని వివరించాడు. కాగా, సౌతాఫ్రికా టూర్ తర్వాత ద్రావిడ్ తనతో డ్రెస్సింగ్ రూంలో మాట్లాడినట్లు సాహా వెల్లడించాడు. జట్టు ఫ్యూచర్ ప్లాన్స్లో సాహా భాగం కాదని, రిటైర్మెంట్ గురించి ఆలోచించుకోవాలనే విధంగా ద్రావిడ్ మాట్లాడినట్లు చెప్పిన సంగతి తెలిసిందే.