Ranji Trophy | హైదరాబాద్, ఆట ప్రతినిధి: కెప్టెన్ రాహుల్ సింగ్ (108; 14 ఫోర్లు, 2 సిక్సర్లు), నితీశ్ రెడ్డి (115; 11 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలతో కదం తొక్కడంతో.. మిజోరాంతో జరుగుతున్న రంజీ మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు చేసింది. ఓవర్నైట్ స్కోరు 120/1తో శనివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 458 పరుగులు చేసింది.
ప్రజ్ఞయ్ రెడ్డి (91), రోహిత్ రాయుడు (60) అర్ధశతకాలతో రాణించారు. మిజోరాం తొలి ఇన్నింగ్స్లో 199 పరుగులకు ఆలౌట్ కాగా.. హైదరాబాద్ జట్టు 259 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్లేట్ గ్రూప్లో భాగంగా ఆడిన గత నాలుగు మ్యాచ్ల్లోనూ బోనస్ పాయింట్ విజయాలు సాధించిన హైదరాబాద్.. ఐదో విజయం దిశగా సాగుతున్నది.