Rachin Ravindra | వన్డే వరల్డ్ కప్ టోర్నీలో సంచలనాలు నెలకొల్పిన న్యూజిలాండ్ యువ కిశోరం రచిన్ రవీంద్ర.. తొలి వరల్డ్ కప్ టోర్నీలోనే అద్భుతమైన ఆటతీరు ప్రదర్శిస్తూ రికార్డులు నెలకొల్పాడు. 23 ఏండ్ల రచిన్ రవీంద్ర.. అంతర్జాతీయ బౌలర్లను శక్తిమంతంగా ఎదుర్కొని పరుగులు వరద పారిస్తున్నాడు. ప్రపంచకప్-2023లో మూడు సెంచరీలు చూసి రికార్డులు నెలకొల్పిన రవీంద్ర.. ప్రస్తుతం టోర్నీలోనే టాప్ స్కోరర్గా నిలిచాడు.
ఇప్పటివరకూ టోర్నమెంట్లో తొమ్మిది మ్యాచ్లు ఆడిన రచిన్ రవీంద్ర స్కోర్ 565 పరుగులు. శ్రీలంకతోనూ జరిగిన మ్యాచ్లో తొలుత రెండు వికెట్లు తీసిన రచిన్ రవీంద్ర.. బ్యాటింగ్ లో 42 పరుగులు చేశాడు. రచిన్ రవీంద్ర భారత్ సంతతి క్రికెట్ కావడం గమనార్హం. రచిన్ రవీంద్ర తండ్రి రవి క్రుష్ణమూర్తి 1990వ దశకంలోనే న్యూజిలాండ్ కు వెళ్లి అక్కడ స్థిర పడ్డాడు. 2021లో భారత్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ తో న్యూజిలాండ్ తరపున ఆడాడు.
ప్రపంచ కప్ టోర్నమెంట్లో అదరగొడుతున్న రచిన్ రవీంద్ర.. వచ్చే ఐపీఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాలని యోచిస్తున్నట్లు పరోక్ష సంకేతాలిచ్చాడు. బెంగళూరు, చిన్న స్వామి స్టేడియం అంటే తనకు చాలా ఇష్టం అని పేర్కొన్నాడు. 2024 ఐపీఎల్ సీజన్ మినీ వేలం వచ్చేనెల 19న దుబాయ్ వేదికగా జరుగనున్నది.