హైదరాబాద్ : నగరంలోని ఉప్పల్ స్టేడియంలో బుధవారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న వన్డే మ్యాచ్కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. మొత్తం 2,500 మందితో భద్రత కల్పిస్తున్నట్టు వెల్లడించారు. మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు.
‘మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టేడియంలోకి ప్రేక్షకులను పంపిస్తాం. మైదానంలోకి సెల్ఫోన్ మినహా మరేదీ అనుమతించబోము. పాసులు, బీసీసీఐ కార్డులు ఉన్న వారు మాత్రమే స్టేడియానికి రావాలి. మైదానంలోకి వెళ్లి క్రికెటర్లకు అడ్డుపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ సమస్య రాకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేశాం. మహిళల కోసం 40 మందితో షీ టీమ్లు ఏర్పాటు చేశాం. మ్యాచ్ టికెట్లు బ్లాక్లో అమ్మితే కఠిన చర్యలు తప్పవు. క్రికెట్ బెట్టింగ్, బ్లాక్ టికెట్లపై ప్రత్యేక నిఘా ఉంచాం. బ్లాక్ టికెట్ల విక్రయంపై ఇప్పటికే మూడు కేసులు నమోదు చేశాం’ అని డీఎస్ చౌహాన్ తెలిపారు.