హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల విద్యార్థులు మరోమారు తమ సత్తాచాటారు. చదువుల్లోనే కాదు ఆటల్లోనూ తాము ఎవరికీ తీసిపోమని చాటిచెప్పారు. చైనా వేదికగా ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు జరిగే అండర్-18 మహిళల ఆసియా సాఫ్ట్బాల్ చాంపియన్షిప్ టోర్నీకి ఎస్సీ గురుకులాలకు చెందిన రాణి, ఇందు ఎంపికయ్యారు. జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న ఈ ఇద్దరు విద్యార్థులు భారత సాఫ్ట్బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రస్తుతం రాణి(సుద్దపల్లి), ఇందు (ఆర్మూర్) గురుకుల సాఫ్ట్బాల్ అకాడమీల్లో శిక్షణ పొందుతున్నారు. ఆసియా సాఫ్ట్బాల్ టోర్నీకి ఎంపికైన రాణి, ఇందును మంత్రి కొప్పుల ఈశ్వర్, గురుకులాల కార్యదర్శి నవీన్ నికోలస్ అభినందించారు.