కౌలాలంపూర్: సుమారు నెలన్నర విరామం తర్వాత బరిలోకి దిగిన బ్యాడ్మింటన్ స్టార్ షట్లర్ పీవీ సింధు మలేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లింది. కౌలాలంపూర్లో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో సింధు 21-17, 21-16 తేడాతో కిర్సీ గిల్మోర్ (స్కాట్లాండ్)ను వరుస సెట్లలో చిత్తుచేసింది. పారిస్ ఒలింపిక్స్కు సన్నద్ధమయ్యేందుకు గాను ఇటీవల ముగిసిన ఊబర్ కప్, థాయ్లాండ్ మాస్టర్స్కు దూరంగా ఉన్న ఈ తెలుగమ్మాయి.. 46 నిమిషాల్లోనే మ్యాచ్ను ముగించింది. మహిళల సింగిల్స్లో అష్మిత చాలిహ 21-17, 21-16తో లిన్ సి యున్ (తైవాన్)ను ఓడించగా పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కిరణ్ జార్జి 21-16, 21-17తో టకుమా ఒబయాషి (జపాన్)ను మట్టికరిపించి ప్రిక్వార్టర్స్కు చేరారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో భార్యాభర్తల జోడీ సుమిత్రెడ్డి- సిక్కిరెడ్డి.. 21-15, 12-21, 21-17 తో లుయి చున్ – ఫు చి యన్ (హాంకాంగ్)పై గెలుపొందారు. పురుషుల డబుల్స్ ద్వయం కృష్ణ ప్రసాద్ -సాయి ప్రతీక్.. 23-21, 21-11తో తైవాన్ జోడీ టాంగ్ కె వి-ఎం. సి ను చిత్తుచేశారు.