ఈ ఏడాది అందని ద్రాక్షగా ఊరిస్తున్న అంతర్జాతీయ టైటిల్ పట్టేందుకు ప్రపంచ చాంపియన్ పీవీ సింధు తొలి అడుగు వేసింది. సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్లో తెలుగమ్మాయి శుభారంభం చేసింది. టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం నెగ్గాక ఆడిన టోర్నీల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సింధు.. తప్పులు సరిదిద్దుకొని ఫుల్జోష్లో బరిలోకి దిగగా.. పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ బోణీ కొట్టాడు. డబుల్స్లో తొలి రోజు భారత్కు నిరాశ ఎదురైంది. సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి,సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప జోడీలు మొదటి మ్యాచ్ల్లో ఓటమి పాలయ్యాయి.
బాలి (ఇండోనేషియా): భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్లో శుభారంభం చేశారు. సీజన్ ముగింపు టోర్నీ తొలి మ్యాచ్ల్లో వీరిద్దరూ వరుస గేమ్ల్లో విజయాలు సాధించారు. బుధవారం మహిళల సింగిల్స్లో సింధు 21-14, 21-16తో లైన్ క్రిస్టోఫెర్సెన్ (డెన్మార్క్)ను చిత్తు చేయగా.. పురుషుల విభాగంలో శ్రీకాంత్ 21-14, 21-16తోనే టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. యువ షట్లర్ లక్ష్యసేన్ కూడా తొలి మ్యాచ్లో గెలుపొందాడు. గ్రూప్-ఏలో భాగంగా ప్రపంచ రెండో ర్యాంకర్ కెంటా మొమోటా (జపాన్), లక్ష్యసేన్ మధ్య జరిగిన పోరు 1-1తో ఉన్న దశలో గాయం కారణంగా మొమోటా తప్పుకోవడంతో లక్ష్యసేన్ ముందడుగు వేశాడు. ఈ టోర్నీలో భారత్ తరఫున ఏకైక టైటిల్ (2018) నెగ్గిన పీవీ సింధు.. గురువారం జరుగనున్న రెండో మ్యాచ్లో వోన్ లీ (జర్మనీ)తో తలపడనుండగా.. కునావత్ వితిద్సరణ్ (థాయ్లాండ్)ను శ్రీకాంత్ ఢీకొననున్నాడు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జోడీ 16-21, 5-21తో కిమ్ అస్ట్రుప్-అండ్రెస్ రాస్ముసెన్ (డెన్మార్క్) జంట చేతిలో ఓడింది. ఈ టోర్నీలో భారత్ తరఫున మహిళల డబుల్స్లో తొలిసారి బరిలోకి దిగిన సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప జంట 14-21, 18-21తో రెండో సీడ్ నమీ మసుయామా-చాహారు షిదా (జపాన్) ద్వయం చేతిలో ఓటమి పాలైంది.
మహిళల సింగిల్స్ గ్రూప్-‘ఎ’లో భాగంగా 38 నిమిషాల్లో ముగిసిన పోరులో సింధు ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబర్చింది. చక్కటి టచ్లో కనిపించిన తెలుగమ్మాయి 5-2తో ముందంజలో నిలిచిన దశలో ప్రత్యర్థి కాస్త ప్రతిఘటించింది. ఫలితంగా సింధు ఆధిక్యం 6-7కు తగ్గింది. అక్కడి నుంచి జోరు పెంచిన సింధు వరుసగా 10 పాయింట్లు ఖాతాలో వేసుకొని అలవోకగా గేమ్ను సొంతం చేసుకుంది. రెండో గేమ్లోనూ ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న సింధు ఒక దశలో 11-10తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. హోరాహోరీ తప్పదనుకుంటున్న తరుణంలో సింధు.. క్రాస్ కోర్ట్ షాట్లతో విరుచుకుపడి గేమ్తో పాటు మ్యాచ్ను సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్ గ్రూప్-‘బి’లో భాగంగా 42 నిమిషాల పాటు జరిగిన పోరులో శ్రీకాంత్ పోరాడి గెలిచాడు. పోటాపోటీగా సాగిన తొలి గేమ్లో ప్రపంచ మాజీ చాంపియన్ శ్రీకాంత్ 11-9తో నిలిచిన దశలో వరుసగా ఐదు పాయింట్లు కొల్లగొట్టి గేమ్ను చేజిక్కించుకున్నాడు. రెండో గేమ్ ఆరంభంలో 1-4తో వెనుకబడ్డ శ్రీకాంత్.. ఆ తర్వాత నెట్ గేమ్తో విజృంభించి మ్యాచ్ను ముగించాడు.