బ్యాంకాక్ : థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్లో భారత టాప్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి అద్భుత ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ఆరో సీడ్ సింధు 21-13, 21-15 తేడాతో కేవలం 28 నిమిషాల్లోనే డెన్మార్క్కు చెందిన అమాలీ షుల్జ్ను చిత్తు చేసింది. క్వార్టర్స్లో ఆమె జపాన్ స్టార్, ప్రపంచ నంబర్ .3 అకానె యమగూచితో తలపడనుంది. కానీ, భారత యువ షట్లర్ దేవిక సిహగ్ 21-23, 11-21తో పిచామోన్ ఓపాట్నిపుత్ (థాయిలాండ్)చేతిలో ఓడిపోయింది.
పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ఏడో సీడ్ లక్ష్యసేన్ 21-12, 21-13తో చైనా షట్లర్ జూ జువాన్ చెన్ను వరుస గేమ్స్లో ఓడించి క్వార్టర్స్లో లోకల్ ఫేవరెట్ కున్లావుట్ విటిడ్సార్న్తో పోటీకి రెడీ అయ్యాడు. అయితే, వెటరన్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ 16-21, 21-11, 18-21తో సు లీ యాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి 21-12, 21-19తో బ్రియాన్ జెరెమీ-ముహమ్మద్ హైకల్ (మలేషియా) ద్వయాన్ని ఓడించి ముందంజ వేసింది.