టోక్యో: ఇండియన్ బ్యాడ్మింటన్ సెన్షేషన్ పుసర్ల వెంకట సింధు ( PV Sindh ) టోక్యో ఒలింపిక్స్ వుమెన్ సింగిల్స్ సెమీస్లో ఓటమిపాలైంది. వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ తైజు యింగ్ ( TAI Tzu-Ying ) చేతిలో 21-18, 21-12 స్కోర్తో హైదరాబాదీ ప్లేయర్ సింధు మ్యాచ్ను కోల్పోయింది. దీంతో సింధు గోల్డ్ ఆశలు ఆవిరయ్యాయి. అయితే బ్రాంజ్ మెడల్ కోసం ఆమె రేపు మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. 2016లో రియో ఒలింపిక్స్లో సిల్వర్ సాధించిన సింధు.. టోక్యోలో మాత్రం కాంస్య పతకం కోసం పోటీపడనున్నది.
గేమ్ వన్.. థ్రిల్లర్
ఇవాళ తొలి గేమ్లో ఆది నుంచి సింధూ రఫాడించింది. చక చకా పాయింట్లు సాధించింది. చైనీస్ తైపీ ప్లేయర్ తైజు యింగ్కు గట్టి పోటీనిచ్చింది. రెండవ ర్యాంక్లో ఉన్న తైపీ ప్లేయర్ కూడా తన ఆటతీరుతో ఆకట్టుకున్నా.. సింధు తన ట్యాలెంట్తో ఆశలు రేపింది. ముసాసినో ఫారెస్ట్ ప్లాజా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో ప్రతి పాయింట్ ఆసక్తికరంగా సాగింది. ఇద్దరు ప్లేయర్లు ఒక్కొక్క పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించారు. 11-8 లీడింగ్లో ఉన్న దశలో మ్యాచ్ పై తైపీ ప్లేయర్ పట్టు సాధించింది. దీంతో ఓ దశలో ఇద్దరూ 13-13కు చేరుకున్నారు. భారీ స్మాష్లతో ఇద్దరూ టెన్షన్ పుట్టించారు. బేస్ లైన్, నెట్ గేమ్లో ఇద్దరూ హోరెత్తించారు. నువ్వే నేనా అన్నట్లుగా ప్రతి పాయింట్ కోసం పోరాడారు. మళ్లీ స్కోర్ 16-16కు చేరుకున్నది. తొలి గేమ్ను తైజు యింగ్ 21-18 స్కోర్ తేడాతో 21 నిమిషాల్లో సొంతం చేసుకున్నది.
తైజు సూపర్ షో..
రెండవ గేమ్ ఆరంభంలోనూ ఇద్దరూ ఒక్కొక్క పాయింట్తో టెన్షన్ పుట్టించారు. ఆ తర్వాత తైజు యింగ్ మెల్లమెల్లగా ఆటపై పట్టు సాధించింది. పాయింట్లను వేగంగా తన ఖాతాలో వేసుకున్నది. సింధు ఎంత పోరాడినా.. కీలకమైన పాయింట్లను సాధించలేకపోయింది. సింధును వత్తిడిలోకి తెచ్చిన తైపీ ప్లేయర్ గేమ్ను ఈజీగా గెలుచుకున్నది. 21-12 స్కోర్తో తైజుయింగ్ 19 నిమిషాల్లో గేమ్ను గెలిచి ఫైనల్లో ప్రవేశించింది.