జకార్తా: ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు(PV Sindhu).. ఇండోనేషియన్ ఓపెన్లో ఇవాళ ఓటమి పాలైంది. వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ ఆన్ సే యంగ్ చేతిలో ఆమ పరాజయాన్ని చూవిచూసింది. 17-21, 14-21 స్కోరుతో దక్షిణ కొరియా క్రీడాకారిణి విజయాన్ని నమోదు చేసింది. అయితే ఇటీవల వరుసగా రెండోసారి ఆన్ సే యంగ్ చేతిలో పీవీ సింధు ఓడింది. గత వారం సింగపూర్ ఓపెన్ క్వార్టర్స్లోనూ సింధు ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఆన్ సే యంగ్, సింధు మధ్య 10 మ్యాచ్లు జరిగాయి. అన్నింటిలోనూ సింధు ఓడింది. ఇప్పటి వరకు ఆన్పై సింధు విక్టరీ నమోదు చేయకపోవడం గమనార్హం.
ఇవాళ జరిగిన రౌండ్-16 మ్యాచ్లో తొలి గేమ్ ఆసక్తికరంగా సాగింది. ఓ దశలో ఇద్దరూ 10-10 స్కోరుతో సమంగా నిలిచారు. కొరియన్ ప్లేయర్ను కాసేపు వత్తిడిలో పెట్టింది సింధు. ఆ తర్వాత 15-14 లీడ్ సాధించింది. కానీ ఆన్ దూకుడు ఆటతో సింధు వెనుకబడింది. తొలి గేమ్ చివరలో 41 షాట్ల ర్యాలీ ఆడారు. ఆ తర్వాత ఓపెనింగ్ గేమ్ను కొరియన్ క్రీడాకారిణి సొంతం చేసుకున్నది. రెండో గేమ్లోనూ ఆన్ ఈజీగా విజయాన్ని నమోదు చేసింది.