చాన్నాళ్ల తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. సింగపూర్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకుంది. ఈ ఏడాది సింధుకు ఇది మూడో టైటిల్ కాగా.. ఈ విజయంతో కామన్వెల్త్గేమ్స్కు ముందు తెలుగమ్మాయి ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంది.
సింగపూర్ ఓపెన్ టైటిల్ కైవసం
సింగపూర్: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సింగపూర్ టైటిల్ కైవసం చేసుకుంది. వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆదివారం మూడో సీడ్ సింధు 21-9, 11-21, 21-15తో చైనా షట్లర్ వాంగ్ జీ యీపై విజయం సాధించింది. 58 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ను సునాయాసంగా చేజిక్కించుకున్న సింధుకు.. రెండో గేమ్లో ప్రత్యర్థి నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్లో కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్న తెలుగమ్మాయి ఈ సీజన్లో తొలి సూపర్-500 టైటిల్ ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది సింధు.. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్లో విజేతగా నిలిచినా.. ఆ రెండు సూపర్-300 టోర్నీలే. టాప్ షట్లర్ సింధు విజయం దేశానికి గర్వకారణమని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ‘సిగపూర్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సింధుకు అభినందనలు. ఈ విజయం దేశానికి గర్వకారణం’ అని మోదీ ట్వీట్ చేశారు. ప్రధానితో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరించదన్, ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు.
గత కొన్ని టోర్నీల్లో క్వార్టర్స్లో ఓటమి పాలవడం నిరాశ పరిచింది. నా శాయశక్తులా కృషిచేసినా.. కొన్నిసార్లు విజయాలు సాధించలేకపోయా. మొత్తానికి ఇక్కడ టైటిల్ నెగ్గడం ఆనందంగా ఉంది. ఈ విజయం ఇచ్చిన జోష్లో కామన్వెల్త్ బరిలో దిగుతా. శారీరకంగా, మానసికంగా ఫిట్గా ఉన్నా.
– పీవీ సింధు