మనీలా: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో తనకు అన్యాయం జరిగిందని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆవేదన వ్యక్తం చేసింది. అంపైర్ తప్పుడు నిర్ణయంతో తాను ఫైనల్కు వెళ్లలేకపోయానని వాపోయింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్లో సింధు 21-13, 19-21, 16-21తో టాప్ సీడ్ అకానె యామగుచి (జపాన్) చేతిలో ఓటమిపాలైంది. రెండో గేమ్లో అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. అంపైర్తో జరిగిన వివాదంపై సింధు మాట్లాడుతూ.. ‘సర్వీస్కు ఎక్కువ సమయం తీసుకుంటున్నానని అంపైర్ చెప్పాడు.
యమగుచి సిద్ధంగా లేకపోవడం వల్లే ఆలస్యమైందని చెప్తున్నా.. వినకుండా అంపైర్ ప్రత్యర్థికి పాయింట్ ఇవ్వడం అన్యాయం. నేను ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం. ఎందుకంటే ఆ సమయంలో 14-11తో ఉన్నా. అదే జోష్తో 15-11తో దూసుకెళ్లేదాన్ని. కానీ ఆ పాయింట్తో స్కోరు 14-12గా మారింది. అంపైర్ పాయింట్ ఇవ్వడమనేది అన్యాయం. లేకపోతే సెమీస్లో నేను గెలిచి ఫైనల్ ఆడేదాన్ని. తప్పు ఎక్కడ జరిగిందో పరిశీలించాలని చీఫ్ రిఫరీకి చెప్పా.. అప్పటికే పాయింట్ ఇచ్చేశాడు కదా అనే జవాబు వచ్చింది. రీప్లేలో చూసి అతడు ఏమైనా చర్యలు తీసుకుంటాడేమో అనుకున్నా’ అని సింధు తెలిపింది.
పతకం అందుకున్నాకే..
ఈ వివాదంతో అసంతృప్తి చెందిన సింధు పతకం తీసుకోలేదనే వార్తలు వెలువడగా.. కాంస్య పతకంతో దిగిన ఫోటోను ఆమె ట్విట్టర్లో పోస్టు చేసింది. ఈ అంశంపై పీవీ రమణ స్పందిస్తూ.. ‘సింధు పతకం స్వీకరించింది. అయితే విమానం అందుకోవడానికి అధికారుల అనుమతితో సింధు వెంటనే బయల్దేరింది. ఉబర్ కప్ టోర్నీ కోసం బ్యాంకాక్కు వెళ్లాల్సి ఉంది. మనీలా నుంచి నేరుగా విమానాలు లేకపోవడంతో భారత్కు వచ్చి మంగళవారం బ్యాంకాక్ వెళ్తుంది’ అని పేర్కొన్నారు.
సింధు కంటతడి
సింధు ఈసారి స్వర్ణం గెలుస్తాననే నమ్మకంతో టోర్నీ ఆరంభించింది. అందుకే తీవ్ర నిరాశకు లోనైంది. నాతో మాట్లాడినప్పుడు కంటతడి పెట్టుకుంది. అది జరిగిపోయిన విషయమని.. మరచిపోవాలని సూచించా. అంపైర్ నిర్ణయం సరి కాదు. ఆమె ఆలస్యం చేస్తే ఎల్లో కార్డుతో హెచ్చరించాలి. అలాగే చేస్తుంటే రెడ్ కార్డు చూపించి.. పాయింట్ ఇవ్వాలి. కానీ అలాంటిదేమీ అక్కడ జరగలేదు’ అని అన్నారు.
– పీవీ రమణ